
హైదరాబాద్, సాక్షి: మరో నెలన్నర రోజుల్లో.. స్థానిక సంస్థల సమరంతో తెలంగాణ వేడెక్కే అవకాశం కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా.. ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేతతో పాటు రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై వేగం పెంచినట్లు సమాచారం.
మొత్తం మూడు ఫేజ్లలో పంచాయితీ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇదివరకే ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. జనవరి 14వ తేదీన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.
పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వానిదే తుది నిర్ణయమని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని.. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇదివరకే ప్రకటించింది. అలాగే.. శాసనసభ ఎన్నికల జాబితాల ఆధారంగా వార్డులు, గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించింది.