
మంత్రి వివేక్కు పోర్ట్పోలియోపై చర్చ
కేటాయింపుపై కొనసాగుతున్న కసరత్తు
ఉమ్మడి జిల్లాకు ఇన్చార్జి కానున్న మంత్రి వివేక్
గత ఏడాదిన్నరగా ఉమ్మడి జిల్లా నుంచి రాష్ట్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం లేక ప్రజలు, నాయకులు, అధికారులకు పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. తాజాగా చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్కు మంత్రి పదవి రావడంతో ఊరట దక్కింది. మరోవైపు రాష్ట్రం ఏర్పడ్డాక, తూర్పు జిల్లా నుంచి తొలిసారిగా మంత్రి పదవి లభించింది. గత ప్రభుత్వంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం ఉండగా.. ఈసారి మంచిర్యాల జిల్లాకు అవకాశం లభించింది.
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పరిపాలన తదితరవన్నీ జిల్లాకు మంత్రి లేకపోవడంతో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం అన్ని పథకాల అమలులో ఇన్చార్జి మంత్రి కీలకంగా మారారు. ప్రస్తుతం మంత్రి సీతక్క ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రిగా కొనసాగుతున్నారు. జిల్లాల వారీగా జరుగుతున్న అభివృద్ధి, పథకాల అమలుపై సమీక్షలు, సమావేశాలు, నియోజకవర్గాల వారీగా పర్యటనలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి ఇకపై వివేక్ ఇన్చార్జి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీంతో ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి పర్యవేక్షణలో సులువు కానుంది. ప్రభుత్వ పరంగా వేడుకలు, అధికారిక కార్యక్రమాలు మంత్రి హోదాలో జరగనున్నాయి.
శాఖలపై కసరత్తు
రెండో విడతలో మంత్రులుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్కుమార్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్ ప్రమాణం స్వీకారం చేశారు. వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. మంత్రి మండలిలో ఖాళీగా హోం, మున్సిపల్, గనులు, కార్మిక, పశుసంవర్ధక, పాడి, సంక్షేమ శాఖలు, ఇతర శాఖలు ఖాళీగా ఉండడంతోపాటు రెండేసి, మూడేసి శాఖలు నిర్వహిస్తున్న మంత్రులు ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారికి ఎవరికి ఏ శాఖ ఇస్తారోనని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దీనిపై కసరత్తు చేస్తుండగా, త్వరలోనే స్పష్టత రానుంది.
వివేక్పైనే ఆశలు
గత పదిహేడు నెలలుగా ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా లేకపోవడంతో నాయకులతోపాటు ప్రజలకు లోటు ఏర్పడింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో నలుగురిలో ఒకరికై నా మంత్రి పదవి వస్తుందని ముందు నుంచి ప్రచారం ఉంది. పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజాగా వివేక్నే ఖరారు చేయడంతో ఆయనపై ఉమ్మడి జిల్లా వాసుల ఆశలు ఉన్నాయి. నిధులు, విధులు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు తదితరవన్నీ ఉమ్మడి జిల్లా నుంచి బలంగా వినిపించాల్సి ఉంటుంది. తన నియోజకవర్గం చెన్నూరుతోపాటు మిగతా ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, గిరిజన ప్రాంతాలు, సింగరేణి తదితర అనేక సమస్యలు ఉన్నాయి.
సీఎంను కలిసిన మంత్రి, ఎంపీ
చెన్నూర్: రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ మంగళవారం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రిగా అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు.