సమీక్షలో సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి
నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్
అధికారులకు సీఎం రేవంత్రెడ్డి ఆదేశం
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: మూసీ పరీవాహక ప్రాంతంలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎంపీ వేం నరేందర్రెడ్డిలతో కలిసి మూసీ రివర్ ఫ్రంట్పై సీఎం సమీక్ష నిర్వహించారు. మూసీ మొదటి దశ ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చించారు. భూ సేకరణ కోసం ఆసక్తిగా ఉన్న వారికి టీడీఆర్ లేదా పరిహారం చెల్లించాలని రేవంత్ చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం తీసుకుంటున్న రక్షణ శాఖ భూముల్లో ఉన్న కార్యాలయాలను రాష్ట్ర ప్రభుత్వమే తరలించాలన్నారు.
ప్రజల సందర్శన కోసం నెక్లెస్ రోడ్డులో మూసీ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మూసీ ప్రాజెక్టులో చేపట్టబోయే పనులు ఇందులో ప్రతిబింబించాలని అన్నారు. ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఎండీ నర్సింహారెడ్డి, ఎంఆర్డీసీఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


