సాక్షి, హైదరాబాద్: భారత్ ఫ్యూచర్ సిటీలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ( FCDA) భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్ది ప్రారంభించారు. ఎఫ్సీడీఏ లోగో, వెబ్సైట్ను ఆయన ఆవిష్కరించారు. శాసన సభ స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. ‘‘నిన్న 2 గంటల వానకే హైదరాబాద్లో నీరు నిలిచిపోయింది. అంతర్జాతీయ నగరం అన్ని గొప్పగా చెప్పుకుంటే సరిపోదు. ఇదేనా మీ పదేళ్ల అభివృద్ధి?. రోడ్లపై వరద పారుతుంటే ఎవరిది బాధ్యత?. ఈ వరద పరిస్థితి మీ కబ్జాల పుణ్యమే కదా’’ అంటూ గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘‘పదేళ్లు అభివృద్ధి చేశామన్న వాళ్లు వరదపై మాట్లాడాలి. ఫ్యూచర్ సిటీని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంకల్పాన్ని అడ్డుకోవాలని రాక్షసులు ప్రయత్నిస్తున్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని అమెరికా వెళ్లి మాట్లాడుతున్నారు. భవిష్యత్ నగరాన్ని రద్దు చేస్తామంటే బండకేసి కొడతారు’’ అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.


