30 శాతం ఫిట్‌మెంట్‌, 61ఏళ్ళకు రిటైర్మెంట్

CM KCR Announce 30% Fitment To TS Govt Employees - Sakshi

గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, హోంగార్డ్స్‌తో సహా అందరికీ వర్తింపు 

మొత్తం 9,17,797 మంది ఉద్యోగులకు లబ్ధి

12 నెలల బకాయిలు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తో కలిపి చెల్లింపు

ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన టీచర్లకు ప్రమోషన్లు

భార్యాభర్తలిద్దరూ ఒకే జిల్లాలో పనిచేసేలా అంతర్‌ జిల్లా 

బదిలీల ప్రక్రియ జీబీవీల్లోని మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు

15% అదనపు పెన్షన్‌ పొందే వయసు 75 నుంచి 70కి తగ్గింపు

సాక్షి, హైదరాబాద్‌: వేతన సవరణ కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుభవార్త చెప్పారు. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 30% ఫిట్‌మెంట్‌ను ప్రకటిం చారు. ఈ ఉత్తర్వులు ఏప్రిల్‌ 1, 2021 నుండి అమల్లోకి వస్తాయని తెలిపారు. గత ఎన్నికల మేని ఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌ వయో పరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాం గంలో భాగమై పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, సెర్ప్‌ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు, వీఆర్‌ఏలు, వీఏఓలు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్, వర్కు చార్జ్‌డ్, డెయిలీ వేజ్‌ తదితర ఉద్యోగులందరికీ కలిపి రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదలను వర్తింపజేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. సోమవారం శాసనసభలో టీ విరామం అనంతరం సీఎం కేసీఆర్‌ పీఆర్‌సీ, ఇతర సమస్యల పరిష్కారంపై ప్రకటన చేశారు.

తెలం గాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను ఆయన కొనియాడారు. ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర సాహసోపేతమైనదని, సకల జనుల సమ్మె దేశ చరిత్రలోనే అద్భుతఘట్టమని అభివర్ణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సైతం పేరు మార్పుకోని సంఘం ఒక్క టీఎన్జీవోయేనని, తెలంగాణ సోయిని నిలిపి ఉంచడంలో టీఎన్జీవో స్ఫూర్తి నింపిందన్నారు. టీజీవో అధ్యక్షురాలు మమత, కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్, కార్యదర్శి ఆర్‌.ప్రతాప్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, కార్యదర్శి యూసుఫ్‌ మియా, పీఆర్‌టీయూ అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, కార్యదర్శి కమలాకర్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్‌తో పాటు ఎమ్మెల్సీ జనార్ధన్‌రెడ్డి, రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌లతో సైతం వ్యక్తిగతంగా చర్చించిన అనంతరం పీఆర్‌సీపై ప్రకటన చేస్తున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. 

బీఆర్‌కేఆర్‌ భవన్‌ వద్ద ఉద్యోగుల ఆనందోత్సాహాలు

9,17,797 మంది ఉద్యోగులకు లబ్ది
రాష్ట్ర సాధనలో స్ఫూర్తిమంతమైన భూమిక పోషించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు స్వరాష్ట్ర అభివృద్ధిలోనూ అంతే నిబద్ధతతో పాలుపంచుకుంటున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. వీరందరి సహకారంతో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల ఫలాలు ప్రజలకు విజయవంతంగా అందుతున్నాయని, ఉద్యోగులతో ప్రభుత్వానికున్న అవినాభావ సంబంధం రీత్యా తెలంగాణ ప్రభుత్వం ఎంప్లాయీస్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నదని, ఉద్యోగులందరి హక్కులను గౌరవిస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడగానే ఉద్యమంలో ఉద్యోగులు పోషించిన పాత్రను అభినందిస్తూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్‌ ఇంక్రిమెంటును ప్రకటించిందని గుర్తుచేశారు. 2014లో పదవ వేతన సవరణ చేస్తూ 43 శాతం అత్యధిక ఫిట్‌మెంటును ప్రకటించి, ఉద్యోగుల పట్ల తనకున్న అభిమానాన్ని తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చాటుకుందన్నారు. ‘కరోనా విపత్తు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అనూహ్యంగా ఏర్పడిన ఆర్థిక లోటు వల్ల 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైంది. ఆర్థిక వ్యవస్థ ఇపుడిపుడే తేరుకుంటున్న నేటి సందర్భంలో మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేస్తున్నాం. వేతన సవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే చేసే పద్ధతిని గత ప్రభుత్వాలు అవలంభించాయి.

తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయ కోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని అన్నిరకాల ఉద్యోగులు కలిపి మొత్తం 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది’అని కేసీఆర్‌ ప్రకటించారు. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు కోరిన విధంగానే ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియను చేపట్టిందని, ఇప్పటికే 80 శాతం ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయిందని వెల్లడించారు. మిగతా అర్హులైన ఉద్యోగులతో పాటు, అర్హులైన ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుందని, ఈ ప్రక్రియ పూర్తయ్యాక రాష్ట్రంలోని అర్హులైన ఉద్యోగులందరూ.. 100 శాతం ప్రమోషన్లు పొందుతారన్నారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుందని ప్రకటించారు. 

ముఖ్యమంత్రి ప్రకటనలో కీలక అంశాలివీ...
– పీఆర్సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీం (ఈ.హెచ్‌.ఎస్‌) నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 
– ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15 శాతం అదనపు పెన్షన్‌ పొందేందుకు ఉన్న వయోపరిమితిని 75 ఏళ్ల నుండి 70 ఏళ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
– గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతో పాటు, ఆ సంఖ్య పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్‌ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
– వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్‌ జిల్లా బదిలీల ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభిస్తుంది. 
– తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తాం.
– కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
– విధి నిర్వహణలో మరణించిన సీ.పీ.ఎస్‌.(కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 
– దేశవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యంతో పాటు, కరోనా విపత్తు విరుచుకుపడటంతో రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది. కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో ప్రజాజీవనంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. కరోనా వల్ల రాబడి తగ్గి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బకాయిలను రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌తో కలిపి అందిస్తాం.
–    ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌ గ్రాట్యుటీని రూ. 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
– గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌ వయో పరిమితిని 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నాం. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో ఈ వయోపరిమితి పెంపును ప్రకటిస్తున్నాం. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. 
– ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ఆశిస్తున్నాం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top