కాంగ్రెస్‌ మునిగే నావ నేనెందుకు చేరతా: కవిత | BRS MLC Kalvakuntla Kavitha Sensational Comments On Congress, More Details Inside | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ మునిగే నావ నేనెందుకు చేరతా: కవిత

May 30 2025 1:19 AM | Updated on May 30 2025 12:55 PM

BRS MLC Kalvakuntla Kavitha sensational comments on congress

ఆ పార్టీతో సంప్రదింపులనేప్రచారం శుద్ధ అబద్ధం 

నా తండ్రి నుంచి నన్నువిడదీసేందుకు కుట్రలు 

పార్టీకి, కుటుంబానికి దూరంచేసేందుకు ప్రయత్నాలు 

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

నన్ను పార్టీ నుంచి బయటకు పంపితే ఎవరికి లాభం? 

నా లేఖను ఎవరో కుట్రపూరితంగా లీక్‌ చేశారు 

నేను మా నాన్నకు లేఖ రాస్తే మీకు నొప్పేంది?.. పెయిడ్‌ ఆర్టిస్టులతో సోషల్‌ మీడియాలో దు్రష్పచారం చేయిస్తున్నారు 

నేను అసలే మంచిదాన్ని కాదు..నోరు విప్పితే తట్టుకోలేరు 

కేసీఆర్‌కు నోటీసులపై పార్టీ కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదు? 

అమెరికాలో పార్టీ రజతోత్సవాలు నిర్వహిస్తే ఏం లాభం? 

పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు 101% ప్రయత్నాలు జరిగాయి 

నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించా..అప్పట్నుంచే ఇలా.. 

కేసీఆర్‌ బలమైన నాయకుడు.. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు

మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌ మునిగి పోయే పడవ. ఆ పార్టీ­లో నేనెందుకు చేరతా?. చేరితే ఏంటి లాభం? నేను కాంగ్రెస్‌ పార్టీతో సంప్రదింపులు జరిపినట్లు జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. నేను కేసీఆర్‌కు రాసిన లేఖను కుట్రపూరితంగా లీక్‌ చేశారు. 2013 తర్వాత నేను కాంగ్రెస్‌ నేతలు ఎవరితోనూ మాట్లాడలేదు. రెండు జాతీయ పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీతో తెలంగాణకు నష్టమే. అయినా బీఆర్‌ఎస్‌ను కొందరు నేతలు బీజేపీకి అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు 101 శాతం ప్రయత్నాలు జరిగాయి. 

నేను మద్యం కేసులో జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదనను నా వద్దకు తీసుకు వస్తే వ్యతిరేకించా. బీఆర్‌ఎస్‌ స్వతంత్రంగా ఉండాలన్నదే నా అభిమతం. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఆరు నెలలు కాదు.. ఏడాదైనా జైల్లో ఉంటా.. పార్టీని బీజేపీలో విలీనం చేయొద్దని కోరా. అప్పటినుంనే నా తండ్రి కేసీఆర్‌ నుంచి నన్ను విడదీసే కుట్రలు, పార్టీకి, కుటుంబానికి దూరం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నన్ను పార్టీ నుంచి బయటకు పంపితే జరిగే లాభం ఎవరికి?’ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. 

బీఆర్‌ఎస్‌ అధినేత, తన తండ్రి కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ బయటకు రావడం, ఆ నేప­థ్యంలో కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించడం, తదితర పరిణామాల నేపథ్యంలో..కవిత గురువా­రం తన నివాసంలో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. పార్టీ పనితీరు, నేతల వ్యవహారశైలి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, అన్న కేటీఆర్‌ పేరు ప్రస్తావించకుండా ఆయనపై.. ఘాటు వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు కవిత మాటల్లోనే.. 

పార్టీని కేసీఆర్‌ కాపాడుకోవాలి.. 
కేసీఆర్‌కు 25 ఏళ్లుగా వందల లేఖలు రాస్తున్నా. అందులో తప్పేముంది. సాధారణంగా లేఖను చదివిన కేసీఆర్‌ చింపే­స్తారు. నా కర్మ బాగా లేకో మరొకటో తెలియదు. కానీ ఎవరో కుట్ర పూరితంగా లేఖను బయటకు లీక్‌ చేశారు. లీకు వీరులను బయట పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతుంటే గ్రీకు వీరుల్లా ప్రవర్తిస్తున్నారు. నేను మా నాన్నకు లేఖ రాస్తే మీకు నొప్పేంది? నాపై ప్రతాపం చూపడం మానుకుని కాంగ్రెస్, బీజేపీపై చూపండి. నేను అసలే మంచిదాన్ని కాదు.. నోరు విప్పితే తట్టుకోలేరు. 

లేఖలో నేను సూచించిన అంశాల్లో ఒక్కటైనా తప్పుందా? కోవర్టులే పార్టీకి నష్టం చేస్తున్నారు. గతంలో పార్టీలో ఉన్న పెద్ద నాయకులు ఇప్పుడు రేవంత్‌ దగ్గర ఉ­న్నా­రు. నాతో ఉన్న నాయకులు ఎవరూ కాంగ్రెస్‌లో చేరలేదు. నేను ఎన్నడూ పదవులు అడగలేదు. ఆత్మాభిమానం మాత్రమే కోరుకుంటా. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించను. నల్లి కుట్ల రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు చేయకుండా ఏ అంశంపైనైనా నేరుగా మాట్లాడతా. నేను బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకం కాదు. కొత్త పార్టీ అవసరం లేదు. ఉన్న పార్టీని బాగా చూసుకుంటే చాలు. పార్టీని కేసీఆర్‌ కాపాడుకోవాలి.  

వారిద్దరూ ఎవరికి దగ్గరో అందరికీ తెలుసు 
రాజ్యసభ ఎంపీ దామోదర్‌రావు, గండ్ర మోహన్‌రావును నా వద్దకు ఎవరు పంపారో తెలియదు. కానీ వారిద్దరూ ఎవరికి దగ్గరో అందరికీ తెలుసు. వారు నాతో చర్చించింది ఒకటి.. బయటకు లీక్‌ చేసింది మరొకటి. ఇతర నేతల విషయాల్లో స్పందిస్తున్న పార్టీ నాయకత్వం.. నేను పార్టీ ఎమ్మెల్సీని అయినా నాపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఎందుకు స్పందించడం లేదు? లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి నేను కారణమైతే నాపై, లేదంటే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. 

పెయిడ్‌ ఆర్టిస్టులతో నాపై తప్పుడు ప్రచారం చేయిస్తూ సోషల్‌ మీడియాలో మహాభారతం కేరక్టర్లు వేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మంచిదేనా? లీకు వీరులను కట్టడి చేయకుండా పెయిడ్‌ ఆర్టికల్స్‌ రాయిస్తే భయపడేది లేదు. 2006లో తెలంగాణ జాగృతి స్థాపించింది మొదలుకుని ఎనిమిదేళ్లు కేసీఆర్‌ నీడలో సైనికురాలిగా పనిచేశా. కడుపులో బిడ్డను పెట్టుకుని ఉద్యమంలో నా శక్తి మేరకు పనిచేశా. 

కేసీఆర్‌ వారించడంతోనే రాజీనామాపై వెనక్కి 
ఢిల్లీ మద్యం కేసులో కేసు నమోదు చేస్తే ఎమ్మెల్సీకి, పార్టీ పదవికి రాజీనామా చేస్తానని కేసీఆర్‌కు చెప్పా. కానీ కుట్రతో బీజేపీ కేసులు పెట్టిందని కేసీఆర్‌ వారించడంతోనే పదవిలో కొనసాగుతున్నా. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే సొంత పార్టీ వారే కుట్రపూరితంగా ఓడించారు. ఎమ్మెల్యేలు నా గెలుపు కోసం పనిచేయలేదు. అయితే అదే నిజామాబాద్‌ జిల్లాలో నాకు ప్రొటోకాల్‌ ఉండాలనే ఉద్దేశంతో కేసీఆర్‌ నాకు మండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరినొకరు ఓడించుకున్నారు 
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పదవుల కోసం పోటీ పడి ఒకరినొకరు ఓడించుకున్నారు. కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టును నిర్మించిన కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే బీఆర్‌ఎస్‌ ఏం కార్యాచరణ తీసుకుంది? నేతలు ఎవరూ ఎందుకు స్పందించలేదు? క్షేత్రస్థాయిలో ఉద్యమ కార్యాచరణ ఎందుకు చేపట్టడం లేదు? నోటీసులపై కార్యాచరణ చేపట్టకుండా అమెరికాలో పార్టీ రజతోత్సవ వేడుకలు నిర్వహిస్తే ఏం లాభం? నన్ను రేవంత్‌రెడ్డి కోవర్టు అనడం ఎంత వరకు కరెక్ట్‌?  

ట్విట్టర్‌ మెసేజ్‌లు సరిపోతాయా? 
పార్టీ నేతల కాలేజీలపైకి బుల్డోజర్లు పోతుంటే ఎందుకు అడ్డుకోవడం లేదు? వారు పార్టీ తరఫున పోటీ చేయడమే తప్పా? తెలంగాణ సోయిలో పరిపాలన జరగడం లేదని బీఆర్‌ఎస్‌ నాయకులు గళం ఎత్తి పోరాడకుంటే పార్టీ ఎలా ముందుకు పోతుంది? మీడియా సెల్‌ పెట్టుకుని దాడులు చేస్తూ క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయకుండా ట్విట్టర్‌లో మెసేజ్‌లు పెడితే సరిపోతాయా? నీటిపారుదల అంశంపై ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. ట్వీట్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఉద్యమం చేయాలి. 

బీఆర్‌ఎస్‌లో ఒకేఒక్క లీడర్‌ కేసీఆర్‌ 
కేసీఆర్‌ కృషితోనే వరంగల్‌ సభ విజయవంతం అయింది. కొందరు నేతలు కేసీఆర్‌ నీడలోనే బతుకుతున్నామనే విషయాన్ని గుర్తించి, కేసీఆర్‌ను తామే మోస్తున్నామనే భ్రమ నుంచి బయటకు రావాలి. నా కుటుంబాన్ని వదిలి నేను ఎందుకు వెళ్తాను? నేను ఎవరి నాయకత్వం కిందా పని చేయను. బీఆర్‌ఎస్‌లో ఒకేఒక్క లీడర్‌ కేసీఆర్‌. ఆయన బలమైన నాయకుడు. ఆయన నాయకత్వంలో మాత్రమే పనిచేస్తా. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు. కేటీఆర్‌కు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా గౌరవం ఇస్తా. 

చంద్రబాబు ఏం చేసినా కేంద్రం అడ్డుకోవడం లేదు 
ఏపీ సీఎం చంద్రబాబు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవటం లేదు. ఏపీ చేపట్టనున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుంది. ప్రజాభవన్‌లో రేవంత్‌తో మీటింగ్‌ తర్వాతే చంద్రబాబు బనకచర్లపై ప్రకటన చేశారు. గోదావరి జలాల్లో తెలంగాణకు వాటా లేకుండా చేయాలనే కుట్రలో భాగంగానే 200 టీఎంసీల ప్రాజెక్టును తెరమీదకు తెచ్చారు.

జాగృతిని విస్తృతం చేస్తా..మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా 
నేను మరో 30 ఏళ్లు రాజకీయాల్లో ఉంటా. పార్టీ చేయని పనులు సగం మేర నేనే చేస్తున్నా. ఉద్యమ సంస్థగా ఏర్పడిన తెలంగాణ జాగృతి పది విభాగాలతో బలంగా ఉంది. దీనిని మరింత విస్తరించడంతో పాటు కార్యాల­యాన్ని అశోక్‌నగర్‌ నుంచి బంజారాహిల్స్‌కు మారుస్తాం. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడంతో పాటు నీటిపారుదల, బీసీలకు సంబంధించిన అంశాలపై రౌండ్‌ టేబుల్‌ సమావేశాలతో స్పీడ్‌ పెంచుతాం. సింగరేణిని అమ్మే కుట్రలపై, కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ కార్యాచరణ చేపట్టాలి. లేనిపక్షంలో తెలంగాణ జాగృతి తరఫున కార్యాచరణ ప్రకటిస్తాం.

పులిబిడ్డ ఎక్కడికీ పోదు 
మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యాఖ్యలు 
సేవాలాల్‌ ఆలయంలో పూజలకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
మేడ్చల్‌: గుండ్లపోచంపల్లి హనుమాన్‌ గడ్డ సమీపంలో గల సేవాలాల్‌ తండాలోని సేవాలాల్‌ ఆలయంలో వార్షికోత్సవ పూజలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. గురువారం మధ్యాహ్నం తన నియోజకవర్గంలోని ఆలయానికి విచ్చేసిన కవితకు పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరులతో కలిసి స్వాగతం పలికారు. ఉదయం కవిత కార్యక్రమం ఖరారు కాగానే ఎమ్మెల్యే కార్యాలయం నుంచి పార్టీ కేడర్‌కు సందేశాలు వెళ్లినట్లు తెలిసింది. 

ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుండ్లపోచంపల్లికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి అరగంట ముందే అక్కడికి చేరుకుని ఏర్పాట్లు పర్యవేక్షించారు. గిరిజన సంప్రదాయ బద్ధంగా డప్పులు, బ్యాండు మేళాలతో, బోనాలతో స్వాగత ఏర్పాట్లు చేశారు. అందరికీ గులాబీ రంగు పగిడీలు ఏర్పాటు చేయించారు. అరగంట సేపు ఆలయం వద్ద ఉన్న కవిత.. ఇటీవలి పరిణామాలపై ఏమీ మాట్లాడకుండానే వెళ్ళిపోయారు. 

మీడియా మాట్లాడించే ప్రయత్నం చేసినా చిరునవ్వుతో దాట వేశారు. అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. కవిత పులిబిడ్డ అని, పుట్టిన బిడ్డ పులివద్దనే ఉంటుందని, ఎక్కడికీ పోదని అన్నారు. కవిత ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్‌ఎస్‌ను వీడి వెళ్ళరని, ఎవరూ ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement