నేడు కేసీఆర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ | BRS Leader KCR cross-examination today | Sakshi
Sakshi News home page

నేడు కేసీఆర్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌

Jun 11 2025 1:16 AM | Updated on Jun 11 2025 5:52 AM

BRS Leader KCR cross-examination today

కాళేశ్వరం బరాజ్‌ల నిర్మాణంపై ప్రశ్నించనున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ 

ఇప్పటికే ఇంజనీర్లు, ఐఏఎస్‌లు, మాజీ మంత్రుల విచారణ పూర్తి  

ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాల ఆధారంగా కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణలో భాగంగా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ కమిషన్‌ బుధవారం ఉదయం 11.30కి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించనుంది. విచారణ కమిషన్‌ ఎదుట ఓ మాజీ ముఖ్యమంత్రి హాజరు కానుండడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి కావడంతో దీనికి ప్రాధాన్యత సంతరించుకుంది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌ 2023 అక్టోబర్‌ 21న కుంగిపోగా.. అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో సైతం లోపాలు బయటపడ్డాయి. ఈ మూడు బరాజ్‌ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ కోసం 2024 మార్చి 14న సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌తో రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్‌ ఏర్పాటు చేసింది. 

బరాజ్‌లకు సంబంధించిన ప్రణాళిక, డిజైన్ల తయారీ, నిర్మాణంతోపాటు నిర్వహణ, పర్యవేక్షణలో పాల్గొన్న నీటిపారుదల శాఖ ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌ అధికారులకు కమిషన్‌ ఇప్పటికే క్రాస్‌ ఎగ్జామినేషన్‌ నిర్వహించి కీలక సాక్ష్యాధారాలను సేకరించింది. బరాజ్‌ల ప్రాంతం ఎంపికతోపాటు ఇతర కీలక నిర్ణయాలను నాటి సీఎం కేసీఆర్‌ తీసుకున్నారని పలువురు మాజీ ఇంజనీర్లు, ఐఏఎస్‌ అధికారులు విచారణ కమిషన్‌ ముందు సాక్ష్యం ఇచ్చారు. 

వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక.. 
ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వేలాది ఫైళ్లను జల్లెడ పట్టిన విచారణ కమిషన్‌ ఎన్నో అవకతవకతలను గుర్తించింది. క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో పాల్గొనే సాక్షులకు వాటి ఆధారంగా కీలక ప్రశ్నలను సంధిస్తోంది. ప్రాణహిత–చెవెళ్ల ప్రాజెక్టు స్థానంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది? తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు బరాజ్‌ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు? బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలను ఎవరు తీసుకున్నారు? వాటికి మంత్రివర్గ ఆమోదం ఉందా? కాళేశ్వరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (కేఐపీసీఎల్‌)ను ఎందుకు ఏర్పాటు చేశారు? బరాజ్‌లలో నిరంతరం నీళ్లు నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు? వంటి అంశాలపై కమిషన్‌ లోతుగా ప్రశ్నిస్తోంది. 

విచారణ చివరి దశకు చేరడంతో ఈ నెల 6న మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, 9న మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును కమిషన్‌ ప్రశ్నించింది. చివరగా బుధవారం కేసీఆర్‌ను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్‌ గుర్తించిన అవకతవకతలను కేసీఆర్‌ ముందు ఉంచుతూ ఆయన నుంచి వివరణ కోరనున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ను ప్రశ్నించడంతో సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేషన్‌ ప్రక్రియ ముగియనుంది. వచ్చే నెలాఖరులోగా ప్రభుత్వానికి కమిషన్‌ తన నివేదికను అందజేసే అవకాశం ఉంది. 

హరీశ్‌రావు సహా ఇంజనీర్లు, నిపుణులతో కేసీఆర్‌ మంతనాలు 
కాళేశ్వరం విచారణ కమిషన్‌ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో కేసీఆర్‌ సోమ, మంగళవారాల్లో పార్టీ నేత హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్వాపరాలపై ఈ భేటీలో లోతుగా చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు రిటైర్డ్‌ ఇంజనీర్లు, సాగునీటిరంగ నిపుణులకు ఫోన్‌ చేసి ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలపై సందేహాలను కేసీఆర్‌ నివృత్తి చేసుకున్నట్లు సమాచారం. 

మరోవైపు కమిషన్‌ ఎదుట హాజరయ్యేందుకు కేసీఆర్‌ ఎర్రవల్లి నివాసం నుంచి వస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు, కార్యకర్తలు కమిషన్‌ కార్యాలయం ఉన్న బీఆర్‌కే భవన్‌కు భారీగా తరలివచ్చేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజకీయ కుట్రతోనే తమ అధినేతను విచారణ పేరిట ఇబ్బంది పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అధినేతకు సంఘీభావంగా తరలిరావాలని కొందరు ఎమ్మెల్యేలు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement