సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అంశం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. విద్యార్థుల ఫీజు బకాయిలు చెల్లించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ బాటలోనే నడుస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తీవ్రంగా ఆరోపించారు. విద్యార్థులు, కాలేజీల సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం అణచివేత ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు నిధులు విడుదల చేయలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం ఒత్తిడికి గురిచేస్తోందని ఆరోపించారు. ఫీజు బకాయిలపై హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత కొంత మొత్తాన్ని విడుదల చేస్తామని చెప్పినా.. ఆ హామీ కూడా అమలు కాలేదని ఆయన అన్నారు. బకాయిల కోసం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఆందోళన చేస్తుంటే వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీకి సవాల్
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కూడా రాంచందర్రావు టార్గెట్ చేశారు. “రాహుల్ గాంధీకి దమ్ముంటే తెలంగాణకు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్పై మాట్లాడాలి” అంటూ సవాల్ విసిరారు. దేశంలో యువతను రెచ్చగొట్టి ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీకి ప్రయోజనాలు అందుతున్నాయంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. విద్యార్థులకు మాత్రం ఫీజు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ను గద్దె దించాలి
దేశ వ్యతిరేక శక్తులతో సీఎం రేవంత్రెడ్డి చేతులు కలుపుతున్నారని రాంచందర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా తమ ప్రయోజనాల కోసం పరస్పరం పోటీ పడుతున్నారని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థుల శక్తి ఏంటో కాంగ్రెస్ ప్రభుత్వానికి చూపించాల్సిన సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: సెల్ఫీ కోసం వచ్చి రాహుల్కి ముద్దుపెట్టిన యువతి.. వేదికపై హైడ్రామా!


