‘ఎల్‌ఏసీ’ని తేలుస్తాం : రాంమాధవ్‌ | BJP Leader Ram Madhav Speech On LAC | Sakshi
Sakshi News home page

‘ఎల్‌ఏసీ’ని తేలుస్తాం : రాంమాధవ్‌

Dec 20 2020 1:51 AM | Updated on Dec 20 2020 8:02 AM

BJP Leader Ram Madhav Speech On LAC - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: పాకిస్తాన్‌తో సరిహద్దు వెంబడి ఉన్న నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) తరహాలో చైనాతో సరిహద్దు వెంబడి వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ)ను తేల్చేందుకు ప్రధాని ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారని బీజేపీ సీనియర్‌ నేత, ఇండియా ఫౌండేషన్‌ డైరెక్టర్‌ వి.రాంమాధవ్‌ తెలిపారు. భారత భూభాగంలో 60 ఏళ్లుగా జరిగిన చైనా ఆక్రమణలను అప్పటి ప్రభుత్వాలు నిలువరించకపోయాయని ఆయన విమర్శించారు. అవేర్‌నెస్‌ ఇన్‌ యాక్షన్‌ ఆధ్వర్యంలో ‘ఇండో–చైనా స్టాండ్‌ ఆఫ్‌: ది రోడ్‌ అహెడ్‌’అనే అంశంపై శనివారం హైదరాబాద్‌లో జరిగిన చర్చా కార్యక్రమానికి ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలసి రాంమాధవ్‌ హాజరై మాట్లాడారు. ‘‘60 ఏళ్లుగా ఎల్‌ఏసీని నిర్వచించలేకపోయాం. కానీ ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే ఎల్‌ఏసీని నిర్వచిస్తుంది. ఏ భూభాగం ఎవరికి చెందుతుందో చైనాతో చర్చిస్తుంది’’అని రాంమాధవ్‌ పేర్కొన్నారు. 

ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులు 
దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రధాని శ్రమిస్తున్నారని, ఏళ్లుగా మూసధోరణితో ఉన్న అంశాలను సంస్కరిస్తున్నారని రాంమాధవ్‌ ఉద్ఘాటించారు. ఆర్థికాభివృద్ధి కోసమే ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ జర్నలిస్ట్‌ మయాంక్‌ సింగ్, అవేర్‌నెస్‌ ఇన్‌ యాక్షన్‌ ప్రతినిధులు బీజీ రాజేశ్వర్, బుచ్చిబాబు, మాధవి, రామకృష్ణ పాల్గొన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement