-
ఆగని డ్రాగన్ దురాశ
ఇది ఆందోళన రేపే వార్త. తక్షణమే అడ్డుకట్ట వేయడానికి ఆలోచించాల్సిన వార్త. పొరుగు దేశం చైనా ‘వాస్తవాధీన రేఖ’ (ఎల్ఏసీ) వెంట తన వైపున మరో 175కు పైగా గ్రామాలను నిర్మిస్తోందట. మన అరుణాచల్ ప్రదేశ్కు అభిముఖంగా సాగుతున్న ఈ కొత్త నిర్మాణాలు ఇప్పటికే ఎల్ఏసీ వెంట డ్రాగన్ సాగించిన 628 ‘షియావోకాంగ్’ (సంపన్న గ్రామాలు)కు అదనం. ఎల్ఏసీ వెంట తన బలం, బలగం పెంచుకొనేందుకు బీజింగ్ మరోసారి దుష్టపన్నాగం పన్నుతోంది. అభిజ్ఞవర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ పత్రిక ప్రచురించిన ఈ కథనం సంచలనం రేపుతోంది. ఈశాన్యంలోని అరుణాచల్ ప్రదేశ్తో పాటు జమ్ము–కశ్మీర్లో లద్దాఖ్ ప్రాంతం వెంట కూడా చైనా వైపున కొత్త గ్రామాలు వెలుస్తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన పరిణామం. వెరసి, రానురానూ ఎల్ఏసీ మరింత వివాదాస్పదం కానుంది. ఇది మన బలగాలు, స్థానికులు తక్షణం జోక్యం చేసుకోవాల్సిన అంశం. నిజానికి, వాస్తవాధీన రేఖ అనేది భూతలంపై స్పష్టంగా నిర్ణయించిన సరిహద్దు ఏమీ కాదు. చైనీయుల నియంత్రణలో ఉన్న భూభాగాన్నీ, భారత నియంత్రిత భూభాగాన్నీ వేరుపరచే ఊహాత్మక సరిహద్దు రేఖ. దీన్ని వాటంగా చేసుకొని, ఊహాత్మక సరిహద్దయిన ఎల్ఏసీ వెంట సైనిక సన్నద్ధతను పెంచుకోవాలనీ, ఆ క్రమంలో అక్కడ మరింత భూభాగంపై తమ హక్కును ప్రకటించుకోవా లనీ చైనా కుటిల ప్రయత్నం. అందుకే, ఆ జగడాలమారి దేశం ఎల్ఏసీ వెంట తన వైపున గ్రామాలకు గ్రామాలు నిర్మిస్తూ వస్తోంది. దాదాపుగా 900 ఎల్ఏసీ గ్రామాలను నిర్మించాలనేది చైనా వ్యూహం. అందులో 200 దాకా గ్రామాలు భారత సరిహద్దుకు సమీపంలో కట్టాలని దాని ప్రయత్నం. ఆ భారీ ప్రయత్నంలో భాగమే ఇప్పుడీ కొత్త నిర్మాణాలు. ఆ గ్రామాలు ఇటు గస్తీ పాయింట్లుగా, అటు భారత్తో ఘర్షణ తలెత్తితే చేతికి అందివచ్చే సైనిక స్థావరాలుగా ఉపకరిస్తాయనేది బీజింగ్ ఎత్తుగడ. చైనా సైనిక వ్యూహం మాట అటుంచితే, కొత్త ఆవాసాలతో అనేక దీర్ఘకాలిక ప్రభావాలున్నాయి. అది మన దేశాన్ని మరింత కలవరపెడుతోంది. గమనిస్తే, భారత – చైనాల మధ్య 2005 నాటి ‘సరి హద్దు రక్షణ సహకార ఒప్పందం’ (బీడీసీఏ) ఉంది. ‘‘సరిహద్దు ప్రాంతాల్లో స్థిరపడ్డ ప్రజానీకం ప్రయోజనాలను ఇరుపక్షాలూ సంరక్షించాలి’’ అని బీడీసీఏలోని ఏడో ఆర్టికల్ పేర్కొంటోంది. ఎప్పుడైనా ఎల్ఏసీని కచ్చితంగా నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తే, అప్పటికి జనావాసాలైన ఈ కొత్త గ్రామాలను కదిలించడానికి వీలుండదు. ఆ అంశాన్ని అడ్డం పెట్టుకోవాలనేది డ్రాగన్ దురా లోచన. అలా తన ప్రాదేశిక హక్కుల వాదనకు బలం చేకూర్చేలా ఈ కొత్త గ్రామాలు, అక్కడ తెచ్చి పెట్టిన జనాభాను వాడుకోవాలనేది దాని పన్నాగం. చైనా వైపు కడుతున్న ఈ కొత్త గ్రామాలకు ఎదురుగా భారత్ వైపున కూడా గ్రామాలు లేకపోలేదు. అయితే, వాటిలో జన సంఖ్య అంతంత మాత్రమే! విస్తరణ కాంక్షతో ఊగుతున్న చైనా ఈ గ్రామాల నిర్మాణంతో ఆగడం లేదు. టిబెట్లో, ఎల్ఏసీ సమీప ప్రాంతాల్లో పెద్దయెత్తున ప్రాథమిక వసతి కల్పన ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే తన 14వ పంచవర్ష ప్రణాళిక (2021 –25)లో భాగంగా సిచువాన్ – టిబెట్ రైల్వేలైను సహా హైస్పీడ్ రైల్వే వ్యవస్థను విస్తరించే పని పెట్టుకుంది. అలాగే, వాస్తవాధీన రేఖ వెంట, భారత భూభాగానికి సమాంతరంగా సాగే రెండు జాతీయ రహదారులను (జీ–219, జీ–318) అప్గ్రేడ్ చేసే పనులూ కూడా ఆ ప్రణాళికలో భాగమే. వాటిలో ఒకటి (జీ–219) లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లకు ఎదురుగా ఉంటే, మరొకటి (జీ–318) అరుణాచల్ ప్రదేశ్, సిక్కిమ్లకు అభిముఖమైనది కావడం గమనార్హం. తద్వారా ఒకపక్క టిబెట్ను తమలో భాగంగా ప్రచారం చేసుకోవడం, మరోపక్క ప్రాథమిక వసతుల పెంపు అనే రెండూ చైనా పెట్టుకున్న లక్ష్యాలు. అసలు 1959 మార్చి 28న దలైలామా నేతృత్వంలోని టిబెటన్ ప్రభుత్వాన్ని అక్రమంగా రద్దు చేసి, టిబెట్ను ఆక్రమించుకున్న చరిత్ర బీజింగ్ది. కానీ, మొన్న షిజాంగ్ (టిబెట్)లో ప్రజాస్వామ్య సంస్కరణకు 65వ వార్షికోత్సవం అంటూ ఎల్ఏసీ వెంట డ్రాగన్ సంబరాలు జరపడం ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నమే! టిబెట్ నుంచి తైవాన్ దాకా అన్నీ తమవేననే డ్రాగన్ రాజ్య విస్తరణ వాదం ప్రపంచానికి కొత్త కాదు. చైనా సాగిస్తున్న ఈ కొత్త గ్రామాల నిర్మాణం నాటకాన్ని సైతం భారత్ గతంలోనే గమనించకపోలేదు. అందుకనే ఆ జనావాసాలను బీడీసీఏ కింద సరిహద్దు చర్చల నుంచి మినహాయించా లని తేల్చిచెప్పింది. డ్రాగన్ మాత్రం తన వంకర బుద్ధి వదులుకోలేదు. భారత్లోని లద్దాఖ్కు అభి ముఖంగా తాను చట్టవిరుద్ధంగా దురాక్రమణ చేసిన ప్రాంతాల్లోనూ చకచకా గ్రామాలు కట్టే పని చేస్తూనే ఉంది. ఇందుకు ప్రతిగా మన దేశం ఎదురుదాడికి దిగింది. ‘సచేతన గ్రామాల పథకం’ పేర ఆ సరిహద్దులోని మన జనావాసాలను ఏడాది పొడుగూతా జనంతో ఉండే ఆధునిక పర్యాటక ఆకర్షణలుగా మార్చాలని ప్రయత్నిస్తోంది. అయితే అదింకా పూర్తి కాలేదు. పనులు సాగుతూనే ఉన్నాయి. తరచూ కయ్యానికి కాలుదువ్వే చైనాకు ముకుతాడు వేయడానికి మనం చేయాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి. క్లిష్టమైన హిమాలయ ప్రాంతాల్లో మనం మనవైపు నిర్మిస్తున్న గ్రామాలు సైతం నిర్మానుష్యంగా మిగలకుండా స్థానిక ప్రజలు ఆవాసం ఉండేలా చూడాలి. దురాక్రమణలు జరగకుండా ఉండాలంటే, స్థానికులు ప్రతి ఒక్కరిలో తామే సరిహద్దును కాపాడే సైనికులమనే భావన కల్పించాలి. మాతృభూమి పరిరక్షణ స్ఫూర్తి రగిలించాలి. అది జరగాలంటే, ముందుగా లద్దాఖ్ లాంటి ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న ప్రజానీకపు న్యాయమైన కోరికలను మన్నించాలి. ప్రాంతీయ సంస్కృతి, ఆకాంక్షలకు అనుగుణంగా మన ఢిల్లీ పాలకులు వ్యవహరించాలి. సొంత ఇంటిని చక్కదిద్దు కొని, పొరుగు ప్రత్యర్థిపై పోరాడే క్రమంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా అన్ని పక్షాలూ కలసిరావాలి. -
భారత – చైనా బంధం బలపడేనా?
సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే! అయితే గల్వాన్ ఘర్షణలు చైనా ప్రణాళికాబద్ధంగా జరిపినవన్న భారత్ అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. ఎల్ఏసీ గురించి సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. వార్షిక వరల్డ్ పీస్ ఫోరమ్లో పాల్గొనడానికి నేను ఈ నెల ప్రారంభంలో బీజింగ్లో ఉన్నాను. ఆ సమావేశంలోనే అదనంగా భారత్–చైనా సరిహద్దు సమస్యపై ఒక ఆంతరంగిక చర్చ జరిగింది. దీనికి పలువురు చైనా విద్వాంసులు హాజరయ్యారు. ప్రస్తుత, మాజీ చైనా అధికారులు కొందరితో సంభాషణకు కూడా వీలు కలిగింది. ఇవి భారత్–చైనా సంబంధాలకు సంబంధించిన అవకాశాల గురించి చైనా అవగాహన విష యంలో ఒక కొత్త గవాక్షాన్ని అందించాయి. సరిహద్దు సమస్యను పూర్తి స్థాయి సంబంధాలలో ఒక అంశంగా మాత్రమే ఉంచాలనీ, అది సంబంధాల మొత్తం స్వభావాన్ని నిర్వచించకూడదనీ చైనీయులు పట్టుబట్టడం కొనసాగిస్తున్నారు. సరిహద్దులో పరిస్థితి ‘అసాధారణం’గా ఉందనీ, ఇది ద్వైపాక్షిక సంబంధాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నదనే భారత వైఖరిని ఇది పరోక్షంగా తిరస్కరించడమే. చైనీయుల ప్రకారం, సరిహద్దు పరిస్థితి ‘స్థిరీకరించబడింది’. ఘర్షణకు సంబంధించిన కొన్ని అంశాలను పరిష్కరించడంలో పురోగతి సాధించామనీ, అయితే మరికొన్ని మిగిలి ఉన్నా యనీ భారతదేశం గుర్తిస్తోంది. 2020 జూన్లో తూర్పు లద్దాఖ్లోని గల్వాన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణలకు ముందు ఉన్న యథాతథ స్థితికి తిరిగి రావడానికి చైనా సుముఖంగా ఉన్నట్లు ఎవరూ భావించడం లేదు. భారత–చైనా సరిహద్దు ప్రశ్న (2005) పరిష్కారానికిగానూ రాజకీయ పారామితులు, మార్గదర్శక సూత్రంతో సహా – వాస్తవాధీన రేఖను (ఎల్ఏసీ) స్పష్టం చేయడం కోసం ఉమ్మడి కసరత్తును చేపట్టేందుకు – అనేక శాంతి భద్రతల ఒప్పందాలను ఇరుపక్షాలు అంగీకరించినప్పటికీ, చైనీయులు అలా చేయడానికి నిరాకరించారు. భూభా గాన్ని ‘కొద్దికొద్దిగా కొరుక్కు తింటూ’ చైనాను భారతదేశం దూరంగా నెడుతోందని ఒక ఆరోపణ వచ్చినప్పుడు, భారత్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్న ఎల్ఏసీ స్పష్టీకరణ ద్వారా అటువంటి కబళింపును కచ్చి తంగా నిరోధించవచ్చని ఎత్తి చూపడం ద్వారా ఒకరు దీనిని ప్రతిఘటించారు. దీనికి సమాధానం ఏమిటంటే, 2004లో జరిగిన సమా వేశంలో ఈ కసరత్తు ప్రారంభమైనప్పుడు, చైనా ప్రాదేశిక క్లెయిమ్లను బలహీనపర్చగల ‘అతిశయోక్తి’ క్లెయిమ్లను భారతదేశం పశ్చిమ సెక్టార్లో ముందుకు తెచ్చింది. ఎల్ఏసీని సరిగా స్పష్టం చేయకపోవడం వల్ల భారత్ అధీనంలో ఉన్న భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి సందిగ్ధతలను ప్రదర్శించగల వీలు చైనాకు కలుగుతుంది. అయితే ఎల్ఏసీ అమరిక గురించి భారత్కు కచ్చితమైన ఆలోచన ఉంది. కొన్ని అంశాల్లో ఎల్ఏసీకి సంబంధించి ‘భిన్నమైన అవగాహనలు’ ఉన్నాయని మనం చెప్పు కోకూడదు. భారత్ పేర్కొన్నట్లుగా ఎల్ఏసీపై పోటీ పడటంలో చైనా పక్షానికి కొంత సమర్థన ఉందని ఇది పరోక్షంగా అంగీకరిస్తుంది. ఎల్ఏసీ అమరికలో మనం పరిగణించే వాటిపై చైనీస్ పక్షాన్ని పోటీ పడనివ్వండి. ఎల్ఏసీ ఎక్కడ ఉందనే దాని గురించి మనకు సందేహం ఉందని మనం పరోక్షంగా కూడా సూచించకూడదు. మొత్తంమీద, సరిహద్దు వద్ద ప్రతిష్టంభన కొనసాగే అవకాశం ఉంది. అయితే రెండు వైపులా భారీ సైన్యాన్ని మోహరించే అవకాశం లేదు. ఎల్ఏసీ వైపు చైనా నిర్మించిన తాజా శాశ్వత, పాక్షిక–శాశ్వత నిర్మాణాలను కూల్చి వేయడం, తొలగించడం కూడా అసంభవం. భారత్ అలవర్చుకోవా ల్సిన మెరుగైన సామర్థ్యానికి ఇవి సూచికలా పనిచేస్తాయి. భవిష్యత్లో ఏం జరగవచ్చో సూచించే రెండు ఘటనలు కూడా ఉన్నాయి. సరిహద్దు సమస్యపై తరచూ వ్యాఖ్యానించే చైనా మాజీ పీఎల్ఏ అధికారి ఒకరు, గల్వాన్ ఘర్షణలు చైనా బలగాలు ముంద స్తుగా, ప్రణాళికాబద్ధంగా జరిపిన ఆపరేషన్ అని భారత్ భావిస్తున్న అభిప్రాయం తప్పు అనీ, అది కేవలం ‘అనుకోని ఘటన’ అనీ నాతో అన్నారు. నేను ఇంతకు ముందు ఇది వినలేదు. పీఎల్ఏ అధికారి చెప్పిందే నిజమైతే, మరి యథాతథ స్థితిని ఎందుకు పునరుద్ధరించకూడదు? ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ కమిషన్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ ఆఫీస్ డైరెక్టర్గా ఉన్న వాంగ్ యీ(జూలై 25నే తిరిగి విదేశాంగ మంత్రి అయ్యారు) ఇటీవల జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్తో జరిపిన భేటీలో, ‘నిర్దిష్ట సమస్యలు మొత్తం సంబంధాన్ని నిర్వచించనివ్వకుండా, సరిహద్దు సమస్యకు ఇరు పక్షాలు పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనాలి’ అన్నారు. ఇది చైనా వైఖరికి పునఃప్రకటన. అయితే, ‘భారత పక్షం చైనాతో సంబంధాలు మెరుగుపర్చుకునేలా, సరిహద్దు సమస్యకు ఇరుపక్షాలకు ఆమోద యోగ్యమైన పరిష్కారాన్ని కనుగొంటుందని ఆశిస్తున్నట్లు’ ఆయన కొనసాగించారు. ఆ ప్రాంతం చైనా సార్వభౌమ భూభాగమనీ, దానిని కాపాడు కుంటామనీ చైనా ప్రకటనలు పేర్కొంటున్నాయి కాబట్టి గల్వాన్ సంఘటన నేపథ్యంలో, ఇది సాపేక్షంగా సామరస్యపూర్వకమైన భాషగా కనిపిస్తోంది. దీంతో సంబంధాలు ‘మెరుగుపర్చుకునే’ అవ కాశం లేకుండా పోయింది. మారిన భాషను మనం అతిగా వ్యాఖ్యా నిస్తున్నామేమో! కాలమే దీన్ని తేల్చి చెబుతుంది. ప్రధాని మోదీ వాషింగ్టన్ లో ఉన్నత స్థాయి అధికారిక పర్యటన విజయవంతంగా ముగించిన తర్వాత వెంటనే బీజింగ్లో నా సంభాషణలు జరిగాయి. భారత్–అమెరికా సంబంధాల్లో పురోగతిపై చైనా ఆందోళన స్పష్టంగా కనిపించింది. చైనాను నిలువరించే అమెరికా వ్యూహంలో భారత్ భాగమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియాలో ‘నాటో’ పాత్రకు భారతదేశం మద్దతు ఇస్తుందా అనేది నాకు వారు సంధించిన ఒక ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం, నాటో అనేది యూరోపియన్ భద్రతకు సంబంధించినదనీ, ఆసియాన్ నేతృత్వంలోని యంత్రాంగాలతో సహా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి ఆసియా అనేక యంత్రాంగాలను కలిగి ఉందనీ నేను చెప్పాను. గ్లోబల్ సౌత్ నుండి చైనాను మినహాయించాలని భారతదేశం ప్రయత్నిస్తున్నదా అనే ఆందోళన కూడా వారిలో ఉంది. తాము గ్లోబల్ సౌత్లో భాగమా, కాదా అనేది నిర్ణయించుకోవాల్సింది చైనాయేనని నేను చెప్పాను. త్వరలో జరగనున్న జీ20 సదస్సు సన్నాహాల్లో భాగంగా, గ్లోబల్ సౌత్ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు మోదీ చొరవ తీసుకోవడం చైనాను ఆశ్చర్యానికి గురిచేసింది. ఆర్థికపరమైన చిక్కులను కలిగించవచ్చు కాబట్టి, చైనాకు ‘అభివృద్ధి చెందుతున్న దేశం’ హోదాను నిరాకరించే అమెరికా ప్రయత్నాల గురించి వారు ప్రస్తావించారు. చైనా చేసిన మరొక ఫిర్యాదు ఏమిటంటే, ‘షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్’ (ఎస్సీఓ) సమావేశాన్ని భారత్ వ్యక్తిగత స్థాయిలో కాకుండా, క్లుప్తంగా ఆన్ లైన్ సదస్సును నిర్వహించడం ద్వారా దాని ‘స్థాయిని తగ్గించింది’ అని. ఇది అమెరికా ప్రభావంతో జరిగిందనే అనుమానం చైనాకు ఉంది. మొత్తంమీద, చైనా తన గురించి తాను అస్పష్టంగానే ఉందనే భావన కలుగుతుంది. అదే సమయంలో భారత్ తన ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రావీణ్యతనూ, చురుకుదనాన్నీ ప్రదర్శించిందనే అభిప్రాయం ఉంది. పెట్టుబడి, సాంకేతికత ప్రవాహానికి భారతదేశం కొత్త గమ్యస్థానంగా మారినట్లు కనిపిస్తున్న నేపథ్యంలో, ఇది చైనా ఆర్థిక అవకాశాల గురించి గుర్తించిన ఒక నిర్దిష్ట నిరాశా వాదానికి సంబంధించినది కావచ్చు. ఇది భారతదేశం పట్ల చైనా వైఖరిలో మార్పును సూచిస్తుందా? ఇకపై సంఘటనలు ఎలా వెల్లడవుతాయో చూద్దాం. శ్యామ్ శరణ్ వ్యాసకర్త విదేశాంగ మాజీ కార్యదర్శి,ఆనరరీ ఫెలో, సీపీఆర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
చైనాపై నమ్మకం సన్నగిల్లింది.. అజిత్ ధోవల్
జోహన్నెస్బర్గ్ : వచ్చే నెలలో దక్షిణాఫ్రికా వేదికగా బ్రిక్స్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సన్నాహాల్లో భాగంగా మొదట జోహన్నెస్బర్గ్లో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ)ల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న భారత జాతీయ భద్రతాధికారి అజిత్ దోవల్ చైనా తన నమ్మకాన్ని పోగొట్టుకుందని వ్యాఖ్యానించారు. ఈ సారి జరగబోయే బ్రిక్స్ సమావేశాల్లోనైనా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చైనా తరపున ఆ దేశ విదేశీ వ్యవహారాల కమిషన్ డైరెక్టర్ వాంగ్ యీ, భారత్ తరపున జాతీయ భద్రతాధికారి అజిత్ ధోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరిద్దరూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి, సరిహద్దు వివాదం తోపాటు మరికొన్ని కీలక అంశాల గురించి చర్చించారు. ఈ సందర్బంగా నియంత్రణ రేఖ (ఎల్ఎసి) వద్ద పరిస్థితిని పరిష్కరించడానికి చైనాతో కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందని ధోవల్ వాంగ్కు స్పష్టం చేశారు. ఢిల్లీ బీజింగ్ ల మధ్య సంబంధాలు మరింత మెరుగుపర్చాల్సిన ఆవశ్యకత ఉందని, రెండు దేశాల మధ్య సామరస్యత ప్రపంచ శాంతికి కూడా దోహదపడుతుందని అన్నారు. దీనికోసం బీజింగ్ మాతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. సరిహద్దులో పరిస్థితి యథాస్థితికి రావాలంటే చైనా ముందు దూకుడు తగ్గించాలని, ఇప్పటికే వారు నమ్మకాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. అప్పుడే భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వస్తాయని మరోసారి గుర్తు చేశారు. దీనికి స్పందిస్తూ వాంగ్ యీ ఏమన్నారంటే.. చైనా కూడా ధోవల్ ప్రస్తావించిన అంశాలపై సానుకూల దృక్పథంతోనే ఉందని రెండు దేశాల మధ్య సంబంధాలు సుస్థిరమైతే శాంతిని స్థాపించవచ్చని అన్నారు. ఇది కూడా చదవండి: మంత్రి ఇంట్లో చోరీ.. కంప్లైంట్ ఇస్తే తిరిగి తన మెడకే చుట్టుకుని.. -
‘సూపర్’ డ్యామ్ నిర్మాణంలో వెనక్కి తగ్గని చైనా? భారత్ను కలవరపెడుతున్న తాజా నివేదికలు!
టిబెట్లోని వాస్తవ నియంత్రణ రేఖకు (ఎల్ఎసి) సమీపంలో గల యార్లంగ్-త్సాంగ్పో నది (భారతదేశంలో దీనిని బ్రహ్మపుత్ర అని పిలుస్తారు) దిగువ ప్రాంతాలపై ‘సూపర్’ డ్యామ్ను నిర్మించేందుకు చైనా తన ప్రణాళికలను కొనసాగిస్తున్నదంటూ మరోమారు నివేదికలు వెలువడ్డాయి. భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా.. ప్రముఖ భౌగోళికరాజకీయ నిపుణుడు బ్రహ్మ చెల్లానీ నిక్కీ ఇటీవల..చైనా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను రహస్యంగా నిర్మించడం సాధ్యం కాదని అన్నారు. కాగా చైనా రూపకల్పనలోని ఈ మెగా ప్రాజెక్ట్ 60 గిగావాట్ల సామర్థ్యం కలిగి భారత సైనిక స్థావరాల సరిహద్దుకు దగ్గరగా ఉంది. కాగా చైనా చేపడుతున్న ఈ ఆనకట్ట నిర్మాణ కార్యకలాపాల నివేదికలు మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తుంటాయి. ఈ ప్రాజెక్టుల స్థాయిని, భౌగోళిక పరిధిని చైనా ఎప్పుడూ వెల్లడించనందున అవి రహస్యంగానే కొనసాగుతున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నదిపై.. బ్రహ్మపుత్ర నది కైలాష్ పర్వతం సమీపంలోని అంగ్సీ హిమానీనదంపై ఉద్భవించింది. 3,969-కిలోమీటర్ల పరిధి కలిగివుంది. దీని ఉపనది యార్లంగ్-త్సాంగ్పో వైవిధ్యమైన వాతావరణ, జలసంబంధమైన మండలాలను కలిగి ఉన్న ఒక ప్రధాన నదీ వ్యవస్థగా అలరారుతోంది. ఇది టిబెట్ అటానమస్ రీజియన్ (టీఏఆర్) నుంచి విభిన్న ప్రాంతాల గుండా ప్రవహిస్తుంది. యార్లంగ్ జాంగ్బో బ్రహ్మపుత్రగా భారతదేశంలోకి ప్రవహిస్తుంది. చివరకు బంగ్లాదేశ్లో డెల్టాను ఏర్పరుస్తుంది. తూర్పు దిశలో అనేక ఉపనదులను తనలో కలుపుకున్న తరువాత నది ఈశాన్యం వైపుకు మారుతుంది. హిమాలయాల తూర్పు చివర పర్వత ప్రాంతాల మధ్య పెద్ద ఇరుకైన మార్గం గుండా వెళ్లి తిరిగి చైనాను దాటుతుంది. భారత వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ)కు ఇరువైపులా 5,000 మీటర్ల పరిధిలో విస్తరించి భారతదేశంలోకి ప్రవేశించినప్పుడు లోతైన గార్జ్ (యార్లంగ్ త్సాంగ్పో గ్రాండ్ కాన్యన్) ఏర్పడుతుంది. నీటి విడుదల పరంగా చూస్తే ఇది ప్రపంచంలోనే తొమ్మిదవ అతిపెద్ద నది (సెకనుకు 19,825 క్యూబిక్ అడుగులు). ఇది కూడా చదవండి: అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ.. ‘ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం’ యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర వద్ద నది భారతదేశంలోకి ప్రవేశించే ముందు ఉన్న ప్రదేశంలో జలవిద్యుత్ ఉత్పత్తి చేయాలని చైనా యోచిస్తోందని సమాచారం. నవంబర్ 2020లో ఆనకట్ట గురించిన నివేదికలు వెలువడినప్పుడు చైనీస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టాబ్లాయిడ్ గ్లోబల్ టైమ్స్.. ‘చైనా యార్లంగ్-త్సాంగ్పో నదిపై ఒక జలవిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇది ఆసియాలోని ప్రధాన జలాల్లో ఒకటి. ఇది భారతదేశం, బంగ్లాదేశ్ గుండా కూడా వెళుతుంది’ అని పేర్కొంది. కాగా పవర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఛైర్మన్.. ‘చరిత్రలో దీనికి సమానమైనది లేదు. ఇది చైనీస్ జలవిద్యుత్ పరిశ్రమకు ఒక చారిత్రాత్మక అవకాశం. ఈ ఆనకట్ట 300 బిలియన్ల ఆదాయాన్ని అందించగలదని’ ప్రకటించారు. బీజింగ్ రూపొందించిన స్వచ్ఛమైన శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఇది సహాయపడుతుందన్నారు. ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన రిపోర్టులు మరోమారు చర్చల్లోకి వచ్చాయి. నీటి దోపిడీలో నిమగ్నమైన చైనా చైనా తమ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కొరతను నివారించేందుకు ఈ నదిని ఉత్తరం వైపు మళ్లించే అవకాశం కూడా ఉందని రిపోర్టులు చెబుతున్నాయి. ఫలితంగా భారతదేశానికి పలు చిక్కులు తలెత్తనున్నాయి. పర్యావరణ సమస్యలు తలెత్తడంతోపాటు బ్రహ్మపుత్ర నీటి ప్రవాహం తగ్గుతుందని పర్యావరణవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. చైనా పలు ప్రధాన నదుల నుండి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి దాదాపు 100 డ్యామ్ల ప్రణాళికలను కలిగి ఉందని భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు బ్రహ్మ చెల్లానీ తెలిపారు. టిబెటన్ పీఠభూమి నుండి ప్రవహించే అన్ని ప్రధాన నదులపై బహుళ డ్యామ్లను నిర్మింపజేస్తూ నీటి దోపిడీలో చైనా నిమగ్నమై ఉందని ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా యార్లంగ్-త్సాంగ్పో నదిపై పలు ప్రాంతాల్లో చైనా చిన్న డ్యామ్లను నిర్మించడం ప్రారంభించింది. ఇప్పుడు అతిపెద్ద ఆనకట్టలను నిర్మించడానికి ప్రణాళికలు జరుగుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తూ.. ఈ ఏడాది జనవరిలో జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పలు ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి, టిబెట్లోని మబ్జా జాంగ్బో (త్సాంగ్పో) నదిపై భారత్-నేపాలీ-చైనీస్ సరిహద్దు ట్రైజంక్షన్కు ఉత్తరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో డ్యామ్ నిర్మిస్తున్నట్లు ధృవీకరించారు. ఇది ఆనకట్ట నిర్మాణ కార్యకలాపానికి సంబంధం లేనప్పటికీ, ఇది హిమాలయ సరిహద్దులోని పలు విభాగాలలో కొనసాగుతున్న అస్థిరతకు మరింత ఆజ్యం పోస్తున్నదన్నారు. యూఎన్ కన్వెన్షన్ ఆన్ నాన్-నేవిగేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ వాటర్కోర్స్ ఆధారంగా రూపొందించిన అంతర్జాతీయ చట్టం ప్రకారం ఈ నదిలో జోక్యానికి వీటో అవకాశం కల్పించలేదు. చైనా ధోరణిపై భారత్ అప్రమత్తం 2002లో కుదిరిన అవగాహన ఒప్పందం (ఎంఓయూ) ప్రకారం చైనా.. యార్లంగ్-త్సాంగ్పో/బ్రహ్మపుత్ర జలసంబంధ సమాచారాన్ని మే, అక్టోబర్ మధ్య భారత్తో పంచుకోవాలి. తద్వారా వర్షాకాలంలో భారీ ప్రవాహం తలెత్తినప్పుడు భారతదేశం అప్రమత్తం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది. అయితే 2017 డోక్లామ్ సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత చైనా నది నీటి ప్రవాహ స్థాయిలను భారత్తో కమ్యూనికేట్ చేయడాన్ని అకస్మాత్తుగా నిలిపివేసింది. ఈ నేపధ్యంలో చైనా ధోరణి విషయంలో భారత్ అప్రమత్తమైంది. ప్రస్తుతం యార్లంగ్-త్సాంగ్పో-బ్రహ్మపుత్ర మార్గంలో చైనా చేపడుతున్న ఆనకట్ట నిర్మాణం పెరుగుతున్న ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింతగా పెంచే అవకాశం ఉందని పర్యావరణవేత్తలు అంటున్నారు. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! -
చైనా సరిహద్దు ఉద్రిక్తత: ఈ సారి కూడా రక్షణ రంగానికి ప్రాధాన్యత?
న్యూఢిల్లీ: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధఙంచిన కేంద్ర బడ్జెట్ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. అటు రానున్న ఎన్నికలు, ఇటు మోదీ సర్కార్కు చివరి వార్షిక బడ్జెట్ కానున్న నేపథ్యంలో రక్షణ రంగంతో పాటు పలు రంగాలు ఈ బడ్జెట్పై ఆశలు పెట్టుకున్నాయి. భారత సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గత బడ్జెట్లలో రక్షణ వ్యయానికి ప్రాధాన్యతనిచ్చింది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)వద్ద చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య బడ్జెట్ 2023 రక్షణ రంగ కేటాయింపులు 10-15 శాతం పెరగవచ్చని అంచనా. 10-15 శాతం పెరగనున్న కేటాయింపులు ఈ బడ్జెట్లో రక్షణ వ్యయం 10-15 శాతం పెరుగుతుందని రక్షణ రంగం అంచనా వేసింది. రక్షణ రంగంలో, ముఖ్యంగా దేశీయ ఉత్పత్తికి సంబంధించి, పరికరాలు, ఆర్ అండ్ డికి సంబంధించిన ఆర్డర్లు వంటి వాటిని అంచనా వేస్తుంది. అదే సమయంలో, ప్రభుత్వ దేశీయ కంపెనీలు తయారీని పెంచడానికి మరింత ప్రోత్సాహాన్ని అందించవచ్చు. 25 శాతం వృద్ధిని, రక్షణ బడ్జెట్ రూ. 6.6 లక్షల కోట్ల వరకు పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎంఎస్ఎంఈలపై దృష్టి దీంతోపాటు, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) మంత్రిత్వ శాఖ కూడా బడ్జెట్లో దృష్టి సారించనుంది. రక్షణ రంగంలో ఎంఎస్ఎంఈ భాగస్వామ్యం మరింత పెరగాలని భావిస్తోంది. పరిశోధన అభివృద్ధి కోసం ప్రకటించిన ప్రోత్సాహకాలు లేదా విధానాలతో పాటు, కొత్త పరికరాల సేకరణకు కూడా బడ్జెట్లో కేటాయించిన మొత్తంలో పెంపును నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా రక్షణ మంత్రిత్వ శాఖకు గతేడాది రూ.5.25 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్ను కేటాయించారు. అలాగే రక్షణ రంగంలో పరిశోధనలకు 25 శాతం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాది రూ.2.33 లక్షల కోట్లు కేటాయించగా, రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.2.39 లక్షల కోట్లు కేటాయించారు. రక్షణ శాఖ పెన్షన్ బడ్జెట్ రూ.1.19 లక్షల కోట్లుగా ఉంది. 'మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్' లో భాగంగా దేశీయ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో దేశీయ స్థాయిలో సామర్థ్య విస్తరణకు రక్షణ రంగం పెద్దపీట వేసింది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement