రిమ్స్‌ వైద్య విద్యార్థులపై దాడి | Attack On RIMS Medical Students In Adilabad, Sparks Student Protest In Campus - Sakshi
Sakshi News home page

రిమ్స్‌ వైద్య విద్యార్థులపై దాడి

Published Fri, Dec 15 2023 4:39 AM

Attack on RIMS medical students - Sakshi

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ వైద్య విద్యార్థులపై బుధవారం అర్ధరాత్రి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ క్రాంతికుమార్‌ బయటి వ్యక్తులతో కలిసి దాడికి పాల్పడిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఘటనలో ఇద్దరు వైద్య విద్యార్థులు గాయాలపాలయ్యారు. డైరెక్టర్‌ చాంబర్‌ ముందు నుంచి బుధవారం సాయంత్రం కవిరాజ్, మరో ముగ్గురు విద్యార్థులు అతి వేగంగా కారులో వెళ్లారు. దీంతో డైరెక్టర్‌ జైసింగ్‌ వారిని మందలించగా, విద్యార్థులు ఆయనతో వాగ్వాదానికి దిగారు.

అనంతరం జైసింగ్‌ అభిమానులమంటూ కొందరు సదరు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. దీంతో  దాడికి పాల్పడిన వారిని శిక్షించాలంటూ గురువారం మెడికోలు తరగతులకు వెళ్లకుండా, ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. జూనియర్‌ డాక్టర్లు విధులు బహిష్కరించారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. దీంతో కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఘటనపై విచారణకు ఆదేశించారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.

ఘటనకు బాధ్యుడైన రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ క్రాంతికుమార్‌ను టర్మినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. మెడికోలకు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మద్దతు తెలిపారు. వైద్య విద్యార్థులపై దాడికి దిగిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ క్రాంతికుమార్‌తోపాటు బయట వ్యక్తులైన వసీమ్, శివ, వెంకటేశ్, శ్రీకాంత్‌పై కేసు నమోదుచేసి, రిమాండ్‌కు తరలించనున్నట్లు ఆదిలాబాద్‌ టూటౌన్‌ సీఐ అశోక్‌ తెలిపారు. విద్యార్థుల ఫిర్యాదుతో రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌పై కూడా కేసు నమోదైంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement