Coronavirus: కరోనా చికిత్సకు కొత్త ఔషధం..! | Anti Covid Drug Molnupiravir begins Phase Three Trials In Yashoda Hospital | Sakshi
Sakshi News home page

Coronavirus: కరోనా చికిత్సకు కొత్త ఔషధం..!

May 22 2021 8:28 AM | Updated on May 22 2021 1:25 PM

Anti Covid Drug Molnupiravir begins Phase Three Trials In Yashoda Hospital - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ చికిత్సకు మరో కొత్త ఔషధం అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో జంతువులు, మనుషులపై రెండు దశలో క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకున్న ‘మోల్నుఫిరావిర్‌–400ఎంజీ’మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమైంది. మన దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ లోని యశోద ఆస్పత్రిలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ లింగయ్య తెలిపారు. నాట్కో ఫార్మాతో కలసి యశోద ఆస్పత్రిలో ఈ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు జరిగిన రెండు దశల్లో జంతువులతో పాటు కోవిడ్‌ బాధితులపై పరిశోధనలు నిర్వహించగా.. మంచి ఫలితాలు వచ్చాయని, ఏ ఒక్కరిలో కూడా దుష్ఫలితాలు తలెత్తలేదని చెప్పారు. అంతేకాకుండా కరోనా వైరస్‌ భారీ నుంచి వారంతా కోలుకున్నట్లు ప్రకటించారు. మూడో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 34 ఆస్పత్రుల్లో 1,218 మందిని ఈ ట్రయల్స్‌కు ఎంపిక చేయగా, యశోద ఆస్పత్రిలో 50 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌ బారిన పడి మైల్డ్‌ సింప్టమ్స్‌తో బాధపడుతున్న 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వారిని ఇందుకు ఎంపిక చేయనున్నారు.

5 రోజుల పాటు ఈ మందులు వాడి, ఆ తర్వాతి రోజు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయగా, నెగెటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు. క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా బాధితులను ఆస్పత్రిలో చేర్చుకోకుండా ఓపీలోనే చూసి రెండు పూటలా ఈ మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వైద్య బృందం ఐదు, పది, పదిహేను రోజుల్లో వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించనున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు నెలల్లో థర్డ్‌ఫేజ్‌ ట్రయల్స్‌ పూర్తవుతాయని, ఆ తర్వాత నాలుగో విడత క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
చదవండి: సోనూసూద్‌ సాయం.. కరోనా బాధితుడి ఇంటికే ఆక్సిజన్‌ యంత్రం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement