
కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్లో గౌరవ వందనం స్వీకరిస్తున్న ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్
దేశానికి ఏ అవసరం వచ్చినా ముందుంటాం
యువ అధికారులు దేశ సేవకు అంకితం అవ్వాలి
ఏఎఫ్ఏలో విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 254 మంది కేడెట్లు
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్ భారత వైమానిక దళ సత్తాకు నిదర్శనంగా నిలుస్తుందని చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ (సీఏఎస్) ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. శత్రువును కచ్చితత్వంతో దెబ్బకొట్ట గలమని నిరూపించామని, భారత వాయుసేన సామర్థ్యాన్ని ఈ ఆపరే షన్లో ప్రదర్శించామని ఆయన పేర్కొన్నారు. భారత వైమానిక దళానికి చెందిన 254 మంది ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ విభాగాల ఫ్లైట్ కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసు కున్న సందర్భంగా దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (ఏఎఫ్ఏ) లో శనివారం ఘనంగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ శిక్షణ పూర్తిచేసుకున్న కేడెట్లకు రాష్ట్రపతి కమిషన్ను(అధికారిక బ్యాడ్జీలను) ప్రదానం చేశారు. వీరితోపాటు భారత నౌకాదళం నుంచి తొమ్మిది మంది అధికారులు, కోస్ట్గార్డ్స్ నుంచి ఏడుగురు, వియత్నాం నుంచి ఒకరు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాలలో అసాధారణ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు పతకాలు అందజేశారు. అనంతరం ఏపీ సింగ్ కేడె ట్లను ఉద్దేశించి మాట్లాడుతూ, యువ అధికారులు దేశ సేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు.
దేశానికి ఏదైనా ముప్పు సంభవించినప్పుడు దానిని ఎదుర్కోవడానికి మొదటి వరుసలో భారత వాయుసేన ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కాగా, తాను భారత వాయుసేనలో చేరి శుక్రవారంతో 40 ఏళ్లు పూర్తయినట్టు ఏపీ సింగ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. యువ అధికా రులకు విజయవంతంగా శిక్షణ ఇచ్చిన ఎయిర్ ఫోర్స్ అకాడమీ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వాయుసేన అధికారుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ట్రైనింగ్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ ఎయిర్ మార్షల్ తేజిందర్ సింగ్, ఎయిర్ ఫోర్స్ అకాడమీ కమాండెంట్ ఎయిర్ మార్ష ల్ పీకే వోహ్రా ఇతర ఎయిర్ఫోర్స్ అధికారులు, కేడెట్ల కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.