చార్జింగ్‌ చాలట్లే! 

Traffic shock for RTC E Garuda electric bus - Sakshi

ఆర్టీసీ ఈ–గరుడ ఎలక్ట్రిక్‌ బస్సుకు ట్రాఫిక్‌ షాక్‌ 

150 కి.మీ.సరిపడా శక్తిని మింగేస్తున్న ట్రాఫిక్‌ 

దీంతో విజయవాడ వరకు సరిపోక సూర్యాపేటలో రెండోసారి చార్జింగ్‌

ప్రయాణికుల అసహనం.. బ్రేక్‌ సమయంలో చార్జింగ్‌ పెడుతున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: ఎలక్ట్రిక్‌ బస్సుల బ్యాటరీలోని చార్జింగ్‌ను ట్రాఫిక్‌ జామ్‌లు హరిస్తున్నాయి. దీంతో బస్సు గమ్యం చేరేందుకు అవసరమైన చార్జింగ్‌ లేకపోవడంతో మధ్యలో మరోసారి బ్యాటరీని చార్జ్‌ చేయాల్సి వస్తోంది. ఇది ఇటీవలే ఆర్టీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ– గరుడ బస్సులకు తలనొప్పిగా మారింది. 

‘ఈ–బస్సు’.. రెండు సార్లు చార్జ్‌ చేయాల్సిందే.. 
♦ ఆర్టీసీ ఇటీవలే పది ఎలక్ట్రిక్‌ బస్సులను అద్దె ప్రాతిపదికన ప్రారంభించిన విషయం తెలి సిందే. తొలి విడతలో అందుబాటులోకి వచి్చ న ఈ పది బస్సులను విజయవాడ వరకు తిప్పుతున్నారు. వీటిని బీహెచ్‌ఈఎల్‌ డిపో ద్వారా నిర్వహిస్తున్నారు. ఎయిర్‌పోర్టుకు తిరు గుతున్న ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం మియాపూర్‌ డిపోలో బ్యాటరీ చార్జింగ్‌ పాయింట్‌లను ఏర్పాటు చేయడంతో, ఈ బస్సులకు కూడా అక్కడే చార్జి చేస్తున్నారు. పూర్తి చార్జింగ్‌ తర్వా త బస్సు ప్రారంభమై ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఎంజీబీఎస్‌కు వెళ్తుంది. అక్కడి నుంచి విజయవాడ బయలు దేరుతుంది. 

సిటీ దాటేటప్పటికే చార్జింగ్‌ డౌన్‌ 
♦ 
మియాపూర్‌–ఎంజీబీఎస్‌ మధ్య 30 కి.మీ. దూరం ఉంది. ఈ రూట్‌ అంతా విపరీతమైన ట్రాఫిక్‌ నేపథ్యంలో తరచూ బస్సుకు బ్రేకులు వేయాల్సి వస్తుండటంతో బ్యాటరీ శక్తి ఎక్కువగా ఇక్కడే ఖర్చవుతోంది. ఎంజీబీఎస్‌లో బయలు దేరిన తర్వాత చౌటుప్పల్‌ వెళ్లే వరకు ట్రాఫిక్‌ కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో కూడా మరింత ఖర్చవుతోంది. మొత్తంగా 150 కి.మీ. దూరం రావాల్సిన శక్తి ఈ రెండు ప్రాంతాల్లోనే ఖర్చవుతుండటంతో విజయవాడ వరకు వెళ్లేందుకు సరిపోవటం లేదు.

విజయవాడకు చేరుకున్న తర్వాత తిరిగి చార్జ్‌ చేసేందుకు, అక్కడి బస్టాండుకు పది కి.మీ. దూరంలో ఉన్న చార్జింగ్‌ పాయింట్‌ వద్దకు వెళ్లాలి. వెరసి మియాపూర్‌ నుంచి ఆ పాయింట్‌ వరకు 325 కి.మీ.దూరం అవుతోంది. సాధారణంగా బ్యాటరీలో 20 శాతం చార్జింగ్‌ ఉండగానే మళ్లీ ఫిల్‌ చేయాలనేది నిబంధన. లేదంటే సాంకేతిక సమస్య తలెత్తి బస్సు ఉన్నదిఉన్నట్టు ఆగిపోతుంది.

దీంతో నగరంలో ఫుల్‌ చార్జ్‌ చేసినా... ట్రాఫిక్‌ చిక్కుల్లో పవర్‌ ఖర్చవుతుండటంతో మధ్యలో మరోసారి విధిగా చార్జ్‌ చేయించాల్సి వస్తోంది. దీంతో సూర్యాపేటలో ఉన్న ఓ ప్రైవేటు చార్జింగ్‌ స్టేషన్‌లో రెండో సారి చార్జ్‌ చేయిస్తున్నారు. ఇది ప్రయాణికులకు విసుగ్గా మారింది. నాన్‌స్టాప్‌గా వెళ్తుందనుకుంటే మధ్యలో ఆగాల్సి రావటం వారికి చిరాకు తెప్పిస్తోంది.  

బ్రేక్‌ సమయంగా మార్పు.. 
విజయవాడ వెళ్లే బస్సులను మధ్యలో కోదాడ వద్దో, ఇతర దాబాల వద్దనో అరగంటపాటు ఆపుతుంటారు. ప్రయాణికుల ఆగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బ్రేక్‌ సమయాన్ని సూర్యాపేటలో ఇస్తూ, ఆ సమయంలోనే బ్యాటరీని చార్జ్‌ చేయిస్తున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు.

సూర్యాపేట బస్టాండులో ఆర్టీసీ సొంతంగా చార్జింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే మరింత వేగంగా చార్జ్‌ అవుతుందని పేర్కొంటున్నారు. మళ్లీ తిరుగు ప్రయాణంలో కూడా, విజయవాడ బస్టాండుకు 10 కి.మీ. దూరంలో ఉన్న పాయింట్‌లో ఫుల్‌ చార్జ్‌ చేయించి.. మళ్లీ సూర్యాపేటలో రెండో సారి చార్జ్‌ చేయిస్తున్నారు. 

ఫుల్‌ డిమాండ్‌.. 
ఈ–గరుడ బస్సులకు ప్రస్తుతం మంచి డిమాండ్‌ ఉంది. ఏసీ బస్సులు కావటం, ఎలక్ట్రిక్‌ బస్సులు కావడంతో చప్పుడు లేకపోవటంతో ప్రయాణికులు వీటిల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లేటప్పటితో పోలిస్తే అక్కడి నుంచి వచ్చేటప్పుడు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల వరసగా కొన్ని రోజులపాటు 100 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. వెళ్లేప్పుడు అది 70 శాతంగా ఉంటోంది. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top