ఫ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
సూర్యాపేట టౌన్ : జిల్లా కేంద్రంలో ఆదివారం బోనాల సందడి నెలకొంది. సూర్యాపేట కృష్ణ టాకీస్ సమీపంలో ఉన్న ఊర ముత్యాలమ్మ దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల సందర్భంగా కృష్ణటాకీస్ సమీపంలో ఉన్న ఊర ముత్యాలమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని వివిధ వార్డుల నుంచి మహిళలు, చిన్నారులు, యువత తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. బోనాల పండుగలో భాగంగా నిర్వహించిన శివసత్తుల ప్రదర్శన ఆకట్టుకుంది. డప్పు చప్పుళ్లు, భక్తుల నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి.


