మఠంపల్లి: మట్టపల్లిలోని రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహుని ఆలయంలో ఆదివారం అర్చకులు వేదమంత్రాలతో స్వామివారి నిత్య కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో సుప్రభాతసేవ, ప్రత్యేక పూజలు, హోమశాలలో నిత్యఅగ్రిహోత్రి చేపట్టారు. గర్భాలయంలో స్వామివారి మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించారు. నిత్య కల్యాణం అనంతరం భక్తులకు మహానివేదనలతో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయా చార్యులు, సాయికుమారాచార్యులు, భక్తులు పాల్గొన్నారు.
సూర్యక్షేత్రంలో
ప్రత్యేక పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకులు కాకులారపు రజితజనార్దన్స్వామి, గణపురం నరేష్, అర్చకుడు భీంపాండే పాల్గొన్నారు.
గురుకులాల్లో
పార్ట్ టైమ్ ఉద్యోగాలు
సూర్యాపేటటౌన్ : జిల్లాలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల రీజినల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశాల మేరకు నియామకాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులు ఉండగా అందులో డిగ్రీ లెక్చరర్లు 3 పోస్టులు, జూనియర్ లెక్చరర్లు 9, పీజీటీ 4, టీజీటీ 3 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. అర్హులు ఈ నెల 22 సాయంత్రం 5 గంటల వరకు జిల్లా కేంద్రంలోని ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
ఫుట్బాల్ ట్రయల్స్కు
ముగ్గురు క్రీడాకారులు
నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర జట్టు సెలక్షన్ ట్రయల్స్కు ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన జి.శివమణి, బి.దత్తు, ఎన్.చరణ్ తేజ్ లను పంపించామని ఉమ్మడి జిల్లా పుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఆదివారం తెలిపారు. జిల్లాలో ప్రతిభావంతమైన ఫుట్బాల్ క్రీడాకారులను గుర్తిస్తూ, వారికి చేయూతనిచ్చి జాతీయస్థాయి క్రీడాకారులగా తయారు చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.


