సూర్యాపేట : శంషాబాద్ నుంచి చౌటుప్పల్, సూర్యాపేట, అమరావతి మీదుగా చైన్నె వరకు జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ కారిడార్ను గతంలో ప్రతిపాదించిన విధంగా కొనసాగించాలని కోరుతూ సూర్యాపేట బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిలపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి ఈ అంశంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను, వర్తక వాణిజ్య అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో కారిడార్ ఏర్పాటు చేసి మూడు బుల్లెట్ ట్రైన్లను మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. సూర్యాపేట మీదుగా వెళ్లే బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పుపై రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడతానని, కేంద్ర మంత్రిమండలితో చర్చించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు అఖిలపక్ష నాయకులు విలేకరులకు తెలిపారు. కిషన్ రెడ్డిని కలిసిన వారిలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కన్వీనర్ ఆరుట్ల జానకిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, అఖిలపక్ష నాయకులు పాదూరి కరుణ, అనుములపురి రవిబాబు, మల్లు నాగార్జునరెడ్డి, ధర్మార్జున్, రమణాచారి, బెజవాడ వెంకటేశ్వర్లు, చల్లమల నర్సింహ, జీడి భిక్షం, కర్నాటి కిషన్, మల్లు లక్ష్మి, రాంబాబు, సట్టు నాగయ్య, తదితరులు ఉన్నారు.
కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష
జాతీయ రహదారి 65కి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి, అఖిల పక్షాల ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలోని వాణిజ్య భవన్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం కొనసాగాయి. మూడో రోజు దీక్షలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. దీక్షలను సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్ ప్రారంభించారు. దీక్షలో మైనార్టీ నాయకులు హఫీజ్ జావెద్, న్యాయవాది ఖలీద్ అహ్మద్, హఫీజ్ రహ్మాన్, మౌలానా, యూనుస్, హఫీజ్ ఆసిఫ్, ఎండీ కలీమొద్దీన్, ఎస్కే సాజిద్, ముఫ్తీ అస్రార్, కాంగ్రెస్ నాయకులు అయ్యుబ్ ఖాన్, జమాల్, లక్ష్మీనారాయణ, వనిత, వజ్జే వీరయ్య పాల్గొన్నారు.
కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి అఖిలపక్షం వినతి


