హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి బుధవారం హుజూర్నగర్ రానున్నారు. ఈ మేరకు మంగళవారం మంత్రి కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో రాత్రి 8 గంటలకు బీఎల్ఏలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)పై సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్ర సరిహద్దులో
పటిష్ట నిఘా
మేళ్లచెరువు : రాష్ట్ర సరిహద్దు కిష్టపట్టె ప్రాంతంలో పటిష్టమైన భద్రతా నిఘా ఉంచామని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. మంగళవారం చింతలపాలెం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా ఆయన తనిఖీ చేశారు. ముందగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. రికార్డులు పరిశీలించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో రాష్ట్ర సరిహద్దు గుండా గంజాయి రవాణా, అసాంఘిక శక్తుల కదలికలపై నిరంతర తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. నూతన పోలీస్స్టేషన్ భవన నిర్మాణాన్ని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు పరమేష్, నవీన్కుమార్, రాంబాబు తదితరులు ఉన్నారు.
రాష్ట్ర అధ్యక్షుడిగా
శ్రీకాంత్గౌడ్
నాగారం : నాగారం మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మొల్కపురి శ్రీకాంత్గౌడ్ గౌడ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మంగళవారం నియమితులయ్యారు. ఈ మేరకు గౌడ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గట్టు రామచంద్రయ్య గౌడ్ హైదరాబాద్లోని ఫిలింనగర్లోని సంఘం కార్యాలయంలో నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం శ్రీకాంత్గౌడ్ మాట్లాడుతూ తన నియామక సహకరించిన సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుండాల మల్లేష్గౌడ్, గౌడ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిత్తలూరు కృష్ణమూర్తిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఎన్జీ కాలేజీ స్నాతకోత్సవం
రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలతో విరాజిల్లుతున్న చరిత్రాత్మక విద్యాసంస్థ నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) మొదటి స్నాతకోత్సవం, బంగారు పతకాల ప్రదానో త్సవం, వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం స్థానిక ఎంఎన్ఆర్ కన్వెన్షన్లో జరగనున్నాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 1956 జూలై 22న స్థాపించిన ఈ కళాశాల ప్రస్థానాన్ని వేదికపై స్మరించుకోనున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్లర్, ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, గౌరవ అతిథులు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి, సీఓఈ ప్రొఫెసర్ జి.ఉపేందర్రెడ్డి, తెలంగాణ కళాశాల విద్యా సంయుక్త సంచాలకుడు ప్రొఫెసర్ డిఎస్ఆర్.రాజేందర్సింగ్, ప్రొఫెసర్ పి.బాలభాస్కర్, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి.రాజేంద్ర ప్రసాద్, రూసా కోఆర్డినేటర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలతో పాటు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులకు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు కళాశాల పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి.మునిస్వామి తెలిపారు.


