భానుపురి (సూర్యాపేట) : ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జలసిరి, తాగునీరు, జల సంరక్షణ పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వీబీ రామ్జీ, స్వచ్ఛ భారత్, జలసిరి, ఎల్నినో, వ్యవసాయ సంబంధిత అంశాలపై జిల్లాలోని ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన వెబ్ఎక్స్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సమర్పించి, మరుగుదొడ్డి లేని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి మంజూరు చేయాలన్నారు. మంజూరైన మరుగుదొడ్లకు సంబంధించిన ఫొటోలను స్వచ్ఛ భారత్ మిషన్ యాప్లో అప్లోడ్ చేసి నిధులు పొందేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంకుడు గుంతలు, బోరుబావుల పునరుద్ధరణ, ఇంటి పైకప్పుల వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు, వ్యవసాయ కుంటలు వంటి పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. పలు సూచినలు చేశారు. సమావేశంలో డీఆర్డీఓ సన్యాసయ్య, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కార్యాచరణ నివేదిక సిద్ధం చేయాలి
జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించి చేపట్టిన చర్యలపై సమగ్ర కార్యాచరణ నివేదికను తక్షణమే సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి జాతీయ రహదారులపై రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా అధికారులతో మాట్లాడారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి పురుషోత్తంరెడ్డి, ఎంవీఐ నవీన్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రాజేందర్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


