అతడు వృద్ధుడు.. వయసు 62 ఏళ్లు.. అయినా గ్రానైట్ క్వారీలో ఒళ్లు హూనం చేసుకుని బతకడం అలవాటైన మనిషి. యజమానుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం అతడి ప్రాణాలు తీశాయి. కోటబొమ్మాళి మండలం దుప్పలపాడు సమీపంలో గల అరసవల్లి గ్రానైట్ క్వారీలో రేగులపాడు గ్రామానికి చెందిన పల్లి ఎర్రయ్య (62) బండరాయి కింద పడి నలిగిపోయాడు. ఒంటి మీద ఎలాంటి రక్షణ కవచం లేకుండా పనిచేస్తున్న ఎర్రయ్యపై అమాంతం దూసుకువచ్చిన బండరాయి ప్రాణాల్ని నలిపేసింది. గ్రానైట్ రాయికి రంధ్రాలు చేస్తున్న సమయంలో రాయి దొర్లుకుంటూ వచ్చి అతడిపై పడింది. ఎర్రయ్యకు భార్య పార్వతి, వివాహితులైన కుమార్తెలు కింజరాపు ఉమా, దేశల్ల హేమలత ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రమాదంలో మరికొంత మంది కార్మికులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. – టెక్కలి రూరల్


