రాలిపోయిన పండుటాకులు ● ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి సాక్ష్యాలు
వృద్ధాప్యంలో ఎటువంటి వారికై నా ఆదరించే ఒక తోడు అవసరం. అటువంటి ఆదరువు లేనివారిని ప్రభుత్వం అక్కున చేర్చుకోవాలి. కానీ ప్రభుత్వం నుంచి అదే కరువవడంతో కుటుంబ రథాన్ని నడిచే ప్రయత్నంలో పండుటాకులు రాలిపోయినట్లు ఆ వృద్ధుల జీవితాలు అర్థంతరంగా ముగిసిపోయాయి. ఎలాగైనా యూరియా సంపాదించాలన్న తపన కాంతమ్మ అనే వృద్ధురాలిని కాటేస్తే.. కూలి చేస్తే తప్ప కూడు దొరకని స్థితిలో ముదిమి వయసులోనూ క్వారీలో చెమటోడుస్తున్న ఎర్రయ్యను అదే క్వారీ బండ నుజ్జునుజ్జు చేసేసింది. ఇక మగదిక్కు లేని ఇల్లు.. పైగా ఇద్దరు ఆడబిడ్డల భారం.. ఆ వృద్ధ మాతను ఎంత కష్టపెట్టిందో లేక ఇంకేదైనా చెప్పుకోలేని సమస్య వచ్చిందో తెలియదు గానీ దాలప్పమ్మ తన ఇద్దరు కూతుళ్లతో సహా బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలో ఒకేరోజు జరిగిన ఈ విషాద ఘటనలు.. ఒక విధంగా ప్రభుత్వ బాధ్యతారాహిత్యానికి, మన చట్టాలు, సంక్షేమ ప్రణాళికల వైఫల్యానికి సాక్ష్యాలు.


