శ్రీకాకుళం డీఎస్పీ
రణస్థలం: స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వ హిస్తే కఠిన చర్యలు తప్పవని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సీహెచ్ వివేకానంద హెచ్చరించారు. ‘మసాజ్ పేరు.. అసాంఘిక కార్యక్రమాల జోరు..’ శీర్షికతో ‘సాక్షి’లో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి స్పందించిన డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు అసాంఘిక, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా, మసాజ్ సెంటర్ల పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో స్పా, మసాజ్ సెంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా, చట్ట విరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న స్పా, మసాజ్ సెంటర్లపై ప్రత్యేక నిఘాతో పాటు తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
సమాచారం ఇవ్వండి
నిబంధనల పాటించకపోతే చర్యలు తప్పవని డీఎస్పీ తెలిపారు. ఇలాంటి కార్యకలాపాలకు భవనం అద్దెకు ఇచ్చిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సెంటర్లు నిర్వహిస్తే అనుమతి ధ్రువీకరణ పత్రాలను ప్రవేశ మార్గం వద్ద ఉంచాలన్నారు. స్పా/మసాజ్ సెంటర్ల పేరుతో ఎవరైనా అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గమనిస్తే 112తో పాటు శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ 6309990804, సంబంధిత పోలీస్ స్టేషన్లకు కూడా సమాచారం అందించవచ్చని తెలిపారు. వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.
సీహెచ్ వివేకానంద వెల్లడి


