● నోటీసు ఇవ్వకుండానే ఇంటిని
కూల్చేశారని ఆవేదన
● పలాస సూదికొండలో ఘటన
పలాస : పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీలోని సూదికొండ కాలనీకి చెందిన దళిత మహిళ శుక్రవారం ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తాను ఎంతో కష్టపడి కట్టించుకున్న ఇంటిని అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చేశారని వాపోయింది. వివరాల్లోకి వెళ్తే.. సూదికొండ కాలనీకి చెందిన కింతాడ దేవి భర్త కొన్నేళ్లు క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. జీడి పరిశ్రమలో పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. వీరంతా కలిసి ప్రస్తుతం అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నారు. దేవి గతంలో సూదికొండలోని వీరబ్రహ్మేంద్ర దేవాలయం వద్ద ఓ వ్యక్తి నుంచి స్థలం కొనుగోలు చేసింది. కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ముతో పాటు కొంత అప్పు చేసి ఇంటి నిర్మాణం చేపట్టింది. ఇంతలో గురువారం మున్సిపల్, రెవెన్యూ, పోలీసు అధికారులు వచ్చి ఆ స్థలం దేవాలయానికి చెందినదంటూ ఆ ఇంటిని జేసీబీతో కూల్చేశారు. దీంతో బాధితురాలు నిర్ఘాంతపోయింది. ఆమె బాధ చూసిన తోటి మహిళలు బాసటగా నిలుస్తూ నిరాహార దీక్షకు ఉపక్రమించారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో మనస్థాపానికి గురైన దేవి వెంటనే ఫినాయిల్ తాగేసింది. అంతకుముందే కొన్ని మాత్రలు మింగినట్టు కుటుంబీకులు చెబుతున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న దేవిని వెంటనే పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


