ఓడీచెరువు: ఆడుతూ పాడుతూ కాలం వెళ్లదీయాల్సిన ఆ పిల్లల బాల్యం ‘బుగ్గి’పాలవుతోంది. బతుకు దెరువు కోసం బొగ్గులు కాలుస్తూ జీవనం సాగించే వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన 21 కుటుంబాలు ఇటీవల ఓడీ చెరువుకు వలస వచ్చాయి. మండల పరిధిలోని సోమావతి నది ఒడ్డున పరికి చెట్ల మొదళ్లు కాల్చి బొగ్గులు తయారు చేసి విక్రయిస్తూ ఆయా కుటుంబ సభ్యులు జీవనం సాగిస్తున్నారు. ఈ కుటుంబాల్లో 20 మంది చిన్నారులు ఉండగా, పాఠశాలలకు వెళ్లాల్సిన వారు బొగ్గుల మధ్య కాలం గడుపుతున్నారు. నిత్యం తల్లిదండ్రులు తెల్లవారుజాము నుంచే బొగ్గుల తయారీ పనిలో నిమగ్నమవుతుండగా, మండుతున్న నిప్పులు, దట్టమైన పొగ మధ్యే వీరి జీవనం సాగుతోంది. పిల్లల భవిష్యత్ అంధకారంలో పడిపోకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుని అండగా నిలవాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అవసరమైన పుస్తకాలు, దుస్తులు, విద్యాసామగ్రి అందించి చదువు కొనసాగించేలా చూడడంతో పాటు ఆయా పిల్లల తల్లిదండ్రుల జీవనోపాధి మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
పాఠశాలలకు వెళ్లకుండా బొగ్గుల బట్టీల వద్ద ఆడుకుంటున్న చిన్నారులు


