ప్రశాంతి నిలయం: పుట్టపర్తి రైల్వేస్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలపై వారికి అర్జీలు సమర్పించుకోవచ్చని సూచించారు. meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ అర్జీలు సమర్పించవచ్చన్నారు.జిల్లా కేంద్రంతో పాటు డివిజన్, మునిసిపల్, మండల కార్యాలయాల్లోనూ కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
పోలీస్ కార్యాలయంలో..
పుట్టపర్తి టౌన్: పోలీస్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల ద్వారా తెలుపుకోవాలని సూచించారు. తమ ఆధార్కార్డు వెంట తీసుకు రావాలన్నారు.
టెట్కు 33 మంది గైర్హాజరు
పుట్టపర్తి: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు 33 మంది గైర్హాజరైనట్లు డీఈఓ కిష్టప్ప పేర్కొన్నారు. ఆదివారం బెంగళూరులోని ఇయాన్ డిజిటల్ జోన్, పుట్టపర్తి సంస్కృతీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో జరిగిన పరీక్షకు 205 మంది హాజరు కావాల్సి ఉండగా 172 మంది హాజరైనట్లు చెప్పారు.బెంగళూరు ఇయాన్ డిజిటల్లో రెండో షిఫ్ట్లో 78 మంది,‘సంస్కృతి’లో రెండో షిఫ్ట్లో 94 మంది హాజరయ్యారన్నారు. టెట్ అర్హత లేని టీచర్లందరూ పరీక్ష రాయాలని ఆయన సూచించారు.
ఘనంగా గౌతు లచ్చన్న జయంతి
ప్రశాంతి నిలయం: కల్టెరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆదివారం సర్దార్ గౌతు లచ్చన్న 117వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గౌతు లచ్చన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లచ్చన్న జీవన విధానం, సిద్ధాంతాలను విద్యార్థులకు వివరించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి రాజేంద్ర కుమార్ రెడ్డి, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రామ్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మెంబర్ వెంగమేష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
సమ్మోహనం
ప్రశాంతి నిలయం: పూరీ జగన్నాథుడు, సాయి జగన్నాథుడి లీలలను కళ్లకు కడుతూ ఒడిశా భక్తులు నిర్వహించిన సంగీత నృత్యరూపకం భక్త కోటిని సమ్మోహన పరిచింది. పర్తి యాత్రలో భాగంగా పుట్టపర్తికి విచ్చేసిన భక్తులు ఆదివారం సత్యసాయి మహాసమాధి చెంత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 2 వేల మంది సత్యసాయి అష్టోత్తర శత నామావళి జపించారు. సాయి నామంతో సాయికుల్వంత్ సభా మందిరం మార్మోగింది. ఒడిశా రాష్ట్ర సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షుడు సత్య స్వరూప్ పట్నాయక్ తమ రాష్ట్రంలో జరుగుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. సాయంత్రం భక్తులు పూరీ జగన్నాథుడు, సత్యసాయి వైభవాన్ని కళ్లకు కడుతూ ‘థ్యాంక్యూ స్వామీ’ పేరుతో సంగీత నృత్యరూపకం ప్రదర్శించి అందరినీ పరవశింపజేశారు.


