ఆత్మకూరు: ఉమ్మడి జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన ఆలయాల్లో ఆత్మకూరు మండలంలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఒకటి. ఆదివారం నుంచి శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభమవడంతో స్వామివారి దర్శనం కోసం ఉమ్మడి జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేల మంది భక్తులు తరలివచ్చారు. శ్రావణ మాసం మొదటి ఆదివారం కావడంతో ఆలయంలో నాగులచవితి సర్పసూక్త క్షీరాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామి వారికి పంచామృతాభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. స్వర్ణముఖ కవచాన్ని ఆలయం చుట్టూ మేళతాళాలతో పల్లకీ సేవ నిర్వహించారు. ఆలయంలోని మంజునాథస్వామి, పార్వతీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున కాలసర్పదోష రాహుకేతు నివారణ హోమాలను నిర్వహించారు. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామి వారి దర్శనకోసం భక్తులు గంటల తరబడి బారులు తీరారు. అనంతపురం ఆర్డీఓ ప్రేమంత్కుమార్ స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.


