పావగడ: శాంత స్వరూపుడు శనీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాస వేడుకలు ఈ నెల 13 నుంచి వచ్చే నెల 5 వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 15న శ్రావణ తొలి శనివారోత్సవం నిర్వహిస్తారు. 21న శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి పండుగ సందర్భంగా శీతలాంబదేవికి విశేష పూజలు ఉంటాయి. 22న ద్వితీయ శ్రావణ శనివారోత్సవం, 29న తృతీయ శ్రావణ శనివారోత్సవం, వచ్చే నెల 5న నాల్గో శ్రావణ శనివారోత్సవం జరగనున్నాయి.
● ప్రస్తుతం ఉన్న ఆలయ స్థలం వద్ద 1955లో శనీశ్వర స్వామి చిత్రపటాన్ని ఉంచి భక్తులు పూజించేవారు. అప్పట్లో పావగడలో కలరా, ప్లేగు వ్యాధులు ప్రబలి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సందర్భగా సీదరగట్ట స్వామి సలహా మేరకు అదే స్థలంలో శీతల యంత్రాన్ని ప్రతిష్టించి శాంతి పూజలు చేయగా.. అప్పట్నుంచి కలరా తగ్గుముఖం పట్టి ప్రజల ప్రాణాలు నిలిచాయి. ఈ పరిణామంతో శీతల యంత్రం శీతలాంబ దేవిగా మారింది. శనీశ్వర స్వామి చిత్రపటం చుట్టూ దేవాలయం రూపుదిద్దుకుంది. కర్ణాటకతో పాటు ఆంధ్ర రాష్ట్రాల నుంచి సైతం పావగడ శనీశ్వర దేవాలయానికి భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. ఎస్ఎస్కే సంఘం అధ్యక్షుడు తొలి అధ్యక్షుడు వెంకటసుబ్బయ్య శెట్టితో పాటు సుమారు 20 ఏళ్ల పాటు అధికార బాధ్యతలు చేపట్టిన దివంగత జీఎస్ ధర్మపాల్లు ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. ప్రస్తుతం ధర్మపాల్ కుమారుడు అనిల్ కుమార్ ఆలయ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
శీతలాంబ దేవి శనీశ్వరుడు
శ్రావణంలో స్వామికి విశేష పూజలు
13 నుంచి వచ్చే నెల 5 వరకు
వైభవంగా వేడుకలు


