● అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్
● ‘పరిష్కార వేదిక’కు 331 అర్జీలు
ప్రశాంతి నిలయం: రపజా సమస్యల పరిష్కార వేదికలో అందే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యతగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. సోమవారం ప్రశాంతి రైల్వే స్టేషన్ సమీపంలోని రెవెన్యూ భవన్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల నుంచి అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిశీ లించి నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి 331 అర్జీలు స్వీకరించి, వాటి పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు కలెక్టర్ బదిలీ చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ కొండయ్య, ఎస్డీసీ విజయ కుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
రెవెన్యూ భవన్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతి పత్రాలు అందజేసేందుకు వచ్చిన దివ్యాంగులకు కలెక్టర్ శ్యాం ప్రసాద్ సహాయ ఉపకరణాలను అందజేశారు. దివ్యాంగులు ఇబ్బందులు పడటం గమనించిన కలెక్టర్ వెంటనే స్పందించి వారికి వినికిడి యంత్రాలు, చేతికర్రలు, ఇతర ఉపకరణాలను అందించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అర్చన పాల్గొన్నారు.


