హిందూపురం: వియత్నం బోటు ప్రమాదంలో మృతిచెందిన హిందూపురం వాసి, లక్కీ సెల్ పాయింట్ యజమాని రవితేజ మృతదేహాన్ని లావా సంస్థ ప్రతినిధులు బంధువులకు మంగళవారం అప్పగించారు. మృతదేహాన్ని చూడగానే ఒక్కసారిగా కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. రవితేజ లావా సంస్థ ప్రతినిధిగా గత పదేళ్లుగా లక్కీ మొబైల్ షాప్ నడుపుతూ లావా సెల్ సంస్థ డిస్ట్రిబ్యూటర్గా పని చేస్తున్నాడు. లావా సెల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్ అయిన రవితేజ సెల్ఫోన్లు విక్రయాలు లక్ష్యాన్ని అధిగమించడంతో విదేశీ పర్యటనకు అవకాశం వచ్చింది. రాష్ట్రంలోని 75 మంది డిస్ట్రిబూటర్లను ఎంపిక చేసి, వియత్నాం దేశానికి తీసుకెళ్లారు. ఈనెల 8న హిందూపురం నుంచి వియత్నాం బయల్దేరి వెళ్లిన రవితేజ 9న వియత్నాం సముద్రం దాటుతూ బోటు బోల్తా పడిన ఘటనలో మృతిచెందాడు. వియత్నాం నుంచి మృతదేహాన్ని ముంబాయి చేరడంతో అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్లో కంపెనీ ప్రతినిధులు, బంధువులు అంబులెన్స్లో హిందూపురంలోని టీచర్స్కాలనీలోని వారి నివాసానికి తీసుకొచ్చారు.
మిన్నంటిన రోదనలు.. : అంబులెన్స్ నుంచి శవపేటికను దించగానే రవితేజ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు ఒక్కసారిగా మిన్నంటాయి. అందరితో మంచి సఖ్యతగా ఉండే రవితేజ మృతి చెందడంతో బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. రవితేజకు తల్లితో పాటు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లావా సంస్థ రవితేజ కుటుంబానికి రూ.25 లక్షలు పరిహారం ప్రకటించారు. తండ్రి మృతదేహాన్ని చూడగానే పెద్ద కుమారై సహస్త్ర కన్నీరుమున్నీరవుతూ ‘ నాన్నా..చూడు నేను మంచి పెయింటింగ్ వేశాను.. చూడు నాన్నా’ అంటూ విలపించడం స్థానికులను కలచివేసింది.
వియత్నాం విహార యాత్రకు వెళ్లి బోటు మునిగి మృతి
కన్నీరుమున్నీరైన కుటుంబ సభ్యులు


