తాడిమర్రి: మండల పరిధిలోని చిత్రావతి నదిలో ఇసుకను అక్రమంగా ఇసుక మాఫియా తోడేస్తోంది. ట్రాక్టర్ల ద్వారా ఇష్టాను సారంగా ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోవాల్సిన అధికారులు మౌనం వహిస్తుండటంతో ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని దాడితోట, నాయనపల్లి, తురకవారిపల్లి గ్రామాల సమీపంలోని చిత్రావతి పరీవాహక ప్రాంతంలో నాణ్యమైన ఇసుక లభిస్తోంది. దీంతో ఇసుకాసురులకు కాసుల వర్షం కురుస్తోంది. రోజూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. తాడిమర్రి మండలంలోని గ్రామాల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేలు, నార్పల సమీప గ్రామాల్లో రూ.6 వేల నుంచి రూ.8 వేలు, అనంతపురం నగరంలో రూ.12 వేల నుంచి రూ.15 వేల ధరకు ఇసుక విక్రయిస్తున్నారు. పెద్ద ఎత్తున ఇసుక తరలిస్తుండడంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. దీంతో భూగర్భ జలాలు అడుగంటి వ్యవసాయంపై ప్రభావం పడుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్రమ ఇసుక తరలింపుపై ఆయా గ్రామాల ప్రజలు అధికారులకు తెలిపినా పట్టీ పట్టినట్లు వ్యవరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ట్రాక్టర్లలో ఇష్టాను సారంగా తరలిస్తున్న ఇసుక
కాసుల వర్షం కురిపిస్తున్న ఇసుక తరలింపు
అధికారుల మౌనంపై గ్రామస్తుల ఆగ్రహం


