కదిరి టౌన్: ప్రజల భద్రతకు పోలీసు శాఖ మరింత ప్రాధాన్యం ఇస్తోందని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆటోల్లో ప్రయాణించే వారు ఏదైనా వస్తువు మరిచిపోయినా, సమస్య ఉన్నా క్షణాల్లో ఆటోను గుర్తించేందుకు పూర్తి వివరాలతో కూడిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అతికిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో ఆవరణలో ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భర ద్వాజ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హాజరయ్యారు. కదిరి పుట్టపర్తి హిందూపురం ధర్మవరం పట్టణాల్లో జిల్లా వ్యాప్తంగా నడిచే అన్ని ఆటోలకు క్యూఆర్ కోడ్ స్టిక్కర్లు అతికించనున్నట్లు తెలిపారు. ప్రతి ఆటోకూ డ్రైవర్కు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత పోలీస్స్టేషన్లో నమోదు చేసి, వాటిని క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రయాణికులు ఆటోలో మొబైల్ఫోన్, లగేజీ లేదా ఇతర విలువైన వస్తువులు మర్చిపోయిన సందర్భాల్లో క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం వల్ల ఆటో నంబర్ ఆధారంగా డ్రైవర్ విరాలను సులభంగా గుర్తించి, కోల్పోయిన వస్తువులను త్వరగా తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. అనంతరం డ్రైవర్లకు క్యూఆర్ కోడ్తో కూడిన స్టిక్కర్లను అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ శివనారాయణస్వామి, సీఐలు వి.నారాయణరెడ్డి, నిరంజన్రెడ్డి, నాగేంద్ర, డీటీఆర్బీ సీఐ లక్ష్మీకాంత్రెడ్డి, ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ఎస్పీ సతీష్కుమార్ వెల్లడి


