శనీశ్వరా.. పాహిమాం
పావగడ: స్థానిక శనీశ్వరాలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం నిర్వహించిన బ్రహ్మరథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం జ్యేష్టాదేవి, శనీశ్వరస్వామి ఉత్సవ మూర్తులను మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకువచ్చి రథంపై అధిష్టింపజేశారు. విశేష పూజల అనంతరం గోవింద నామస్మరణతో రథాన్ని భక్తులు లాగారు. శని మహాత్మ సర్కిల్ను చుట్టేసి శిరా మార్గంలో ఉన్న ఆలయ సమీపానికి చేర్చారు. స్థానిక తుముల్ డైరెక్టర్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేశారు. అన్నపూర్ణ దాసోహ భవనంలో భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు. వేడుకల్లో ఆలయ సమితి అధ్యక్షుడు అనిల్కుమార్, పదాధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.


