● రామాపురంలో
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
● భారీ గోతులతో సాగునీరు పారని పరిస్థితి
సాక్షి టాస్క్ఫోర్స్: పేదవాడు తన అవసరాలకు కొద్దిగా మట్టిని తోలుకుంటే కేసులు పెట్టే అధికారులు కూటమి నేతలు ఇష్టారాజ్యంగా చెరువు మట్టిని తరలిస్తున్నా అటు వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. చిట్టమూరు మండల పరిధిలోని చిల్లమూరు పంచాయతీ రామాపురం చెరువులో కూటమి నాయకులు అక్రమంగా గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. ఇదేమని అడిగితే మమ్మల్ని ఎవడ్రా ఆపేది అంటూ దౌర్జన్యం చేస్తున్నారని ఆయకట్టు రైతులు భయాందోళనకు గురవుతున్నారు. దీంతో కూటమి నాయకులు చెరువులో మూడు పెద్ద హిటాచీలు పెట్టి రాత్రి, పగలు పది టిప్పర్లకు మట్టిని నింపి సాగరమాల రోడ్డుకు తోలుకుని రూ.లక్షలు సొమ్ము చేసుకుంటున్నారని రైతులు వెల్లడిస్తున్నారు. చెరువు తూముల కంటే లోతుగా మట్టిని ఎత్తి వేయడంతో సాగునీరు పొలాలకు పారని పరిస్థితి నెలకొంటోంది. అయితే కూటమి నేతలకు కొంత మంది వత్తాసు పలుకుతూ మట్టి ఎత్తడం వల్ల చెరువు లోతు అవుతుందని సన్నాయినొక్కులు నొక్కుతూ గ్రామస్తులను మభ్యపెడుతున్నారు. కూటమి నేతలు మట్టి మాఫియాగా మారి ధనార్జనే ధ్యేయంగా ప్రవర్తిస్తున్నారు. అధికారులు చెరువులో మట్టి తరలింపునకు ఎలా అనుమతులు ఇస్తారని గ్రామస్తులు వాపోతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు స్పందించి అక్రమ మట్టి తరలింపును అడ్డుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
ఆపేవారే లేరా?
నిత్యం ధనార్జనే ధ్యేయంగా చిట్టమూరు మండలంలో కూటమి నాయకులు అధికారులను ఒత్తిళ్లకు గు రి చేసి ప్రజాప్రతినిధుల సహకారంతో మట్టి, ఇసుక, గ్రావెల్ తవ్వకాలు జరుపుతున్నారని ప్రజ లు వాపోతున్నారు. మండలంలో ఒక్కో గ్రామాన్ని ఎంచుకుని స్థానికంగా ఉన్న అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై మీ గ్రామానికి ఎంతో కొంత నగదు ఇస్తామని నమ్మబలికి పబ్బం గడుపుతున్నారు. ప్రకృతి సంపదను కొల్లగొట్టి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు పంచుకుంటూ పోతున్నారు.


