● టీడీపీ నేతల అండతోనే..
చిట్టమూరు: గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిరుపేదలకు కేటాయించిన ఇంటి స్థలాలను ఆక్రమించారని ఆరోపిస్తూ మండలంలోని నార్తువరత్తూరు గ్రామానికి చెందిన గిరిజన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నాటి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 20 మంది నిరుపేద కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించింది. వీరిలో 13 మంది గిరిజనులు, ముగ్గురు బీసీలు, నలుగురు దళితులకు రెవెన్యూ అధికారులు హద్దులు చూపించి పట్టాలు అందజేశారు. స్థలాలను లెవలింగ్ చేశారు. అయితే మంగళవారం గ్రామంలోని కొందరు టీడీపీ నేతల అండతో నాలుగు ప్లాట్లలో మట్టిని తోలించి ఆక్రమించారని బాధితులు ఆరోపించారు. గిరిజన కాలనీకి చెందిన ఈగా కావేరి, అద్దూరు సునీతతోపాటు మరో ఇద్దరి స్థలాల్లో మట్టి తోలారని చెబుతున్నారు. ఈ విషయంపై ప్రశ్నించగా ‘మీకు దిక్కున చెప్పుకోండి’ అంటూ బెదిరింపులకు దిగారని వారు వాపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత తమకు పక్కా ఇళ్ల నిర్మాణం జరగకపోవడంతో, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేకపోయామని, అదే అవకాశంగా భావించి ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తహసీల్దార్ రామయ్యను వివరణ కోరగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.


