● కలెక్టరేట్ ఎదుట ఏఐఎస్ఎఫ్ మహాధర్నా
● విద్యాశాఖ మంత్రి లోకేశ్
రాజీనామాకు డిమాండ్
నెల్లూరురూరల్: రాష్ట్రంలో విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం నెల్లూరులో మహాధర్నా నిర్వహించారు. వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందెల నాసర్జీ మాట్లాడుతూ పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయాల వరకు సమస్యలు పేరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వసతి గృహాలకు తగిన నిధులు కేటాయించడం లేదన్నారు. ఖాళీగా ఉన్న కుక్, వార్డెన్ తదితర పోస్టులను భర్తీ చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో డ్రాపౌట్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే బకాయిలు
డిగ్రీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో సర్టిఫికెట్లు పొందేందుకు కళాశాలల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో రూ.6,400 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ కళాశాలలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ మస్తాన్ షరీఫ్ మాట్లాడుతూ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే పేరుతో పలు విభాగాలను మూసివేస్తున్నారని, టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో మూడు వేలకుపైగా ఖాళీ పోస్టులున్నా భర్తీ చేయడం లేదన్నారు. సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాయకులు అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి శివం వర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు యస్దాని, రూరల్ అధ్యక్షుడు సోహైల్, నాయకులు జీవన్, కోటి, పండు, అర్షద్, సాహ తదితరులు పాల్గొన్నారు.


