● ఎస్పీ అజిత
నెల్లూరు(అర్బన్): చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ అజిత తెలిపారు. సోమవారం నెల్లూరులోని పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా పలువురు బాధితులు వచ్చి అర్జీలు ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 175 అర్జీలందాయి. కార్యక్రమంలో ఏఎస్పీ (అడ్మిన్) సౌజన్య, నగర ఏఎస్పీ దీక్ష, డీటీసీ డీఎస్పీ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.
వినతుల్లో కొన్ని..
● నేను 20 ఎకరాల్లో వరి సాగు చేశాను. ధాన్యాన్ని బాపట్ల, ప్రకాశం జిల్లాలకు చెందిన రైస్మిల్లు యజమానులు బత్తల సీతారామయ్య, బత్తల వెంకటేశ్వర్లు, మందాటి వెంకటేశ్వర్లుకు విక్రయించా. వారు రూ.12 లక్షలు ఇవాల్సి ఉంది. డబ్బులివ్వమని చంపుతామని బెదిరిస్తున్నారు. న్యాయం చేయాలని అల్లూరు పోలీస్స్టేషన్ పరిధికి చెందిన ఓ వ్యక్తి అర్జీ ఇచ్చాడు.
● మా ఇంట్లో జనవరి నెలలో దొంగతనం జరిగింది. భారీ స్థాయిలో బంగారు, డబ్బులు పోయాయి. పోలీస్స్టేషన్లో కేసు పెట్టాను. సొత్తును రికవరీ చేయలేదు. విచారణ జరిపి న్యాయం చేయాలని ఇందుకూరుపేట పోలీస్స్టేషన్ పరిధికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
● శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి హైదరాబాద్లో ఉన్నప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి అవసరాల కోసం రూ.2 లక్షలు తీసుకున్నాడు. ఇప్పడు పరారీలో ఉన్నాడు. రామకృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించి న్యాయం చేయాలని కోవూరు పోలీస్స్టేషన్ పరిధికి చెందిన ఓ మహిళ వినతిపత్రం ఇచ్చారు.


