కాంస్యం కోసం యువ భారత్‌ పోరు | Young India fight for bronze | Sakshi
Sakshi News home page

కాంస్యం కోసం యువ భారత్‌ పోరు

Oct 26 2024 4:04 AM | Updated on Oct 26 2024 4:04 AM

Young India fight for bronze

న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌ ‘డ్రా’ 

చేజారిన ఫైనల్‌ బెర్త్‌

నేడు మరోసారి న్యూజిలాండ్‌తో ‘ఢీ’  

కౌలాలంపూర్‌: జొహర్‌ కప్‌ అండర్‌–21 అంతర్జాతీయ పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారంతో రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. టాప్‌–2లో నిలిచిన ఆ్రస్టేలియా, బ్రిటన్‌ జట్లు టైటిల్‌ కోసం పోటీపడనుండగా... మూడో స్థానంలో నిలిచిన భారత్, నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌ జట్లు కాంస్య పతకం కోసం తలపడతాయి. 

5–6 స్థానాల కోసం జపాన్, ఆతిథ్య మలేసియా జట్లు ఆడతాయి.  వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదున్న భారత జట్టుకు నాలుగో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా కళ్లెం వేసింది. ఒక్క గోల్‌ సమర్పించుకోకుండా భారత్‌ఫై నాలుగు గోల్స్‌ సాధించి ఆ్రస్టేలియా ఘనవిజయం నమోదు చేసుకుంది. అయినప్పటికీ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై గెలిస్తే భారత జట్టు ఫైనల్‌కు చేరుకునేది. కానీ అలా జరగలేదు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను భారత జట్టు 3–3తో ‘డ్రా’ చేసుకుంది.

భారత్‌ తరఫున గుర్జోత్‌ సింగ్‌ (6వ నిమిషంలో), రోహిత్‌ (17వ నిమిషంలో), తాలెమ్‌ ప్రియోబర్తా (60వ నిమిషంలో) ఒక్కో గోల్‌ చేశారు. న్యూజిలాండ్‌ జట్టుకు జాంటీ ఎల్మెస్‌ (17వ, 32వ, 45వ నిమిషాల్లో) ఏకంగా మూడు గోల్స్‌ అందించాడు. కివీస్‌తో మ్యాచ్‌ ‘డ్రా’ కావడంతో భారత జట్టు ఫైనల్‌ బెర్త్‌ ఖరారయ్యేది ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై ఆధార పడింది. 

అయితే బ్రిటన్‌ జట్టు 3–1తో జపాన్‌పై, ఆ్రస్టేలియా 9–3తో మలేసియాపై ఘనవిజయం సాధించాయి. ఫలితంగా బ్రిటన్, ఆ్రస్టేలియా, భారత జట్లు 10 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్‌ సగటు ఆధారంగా ఆ్రస్టేలియా, బ్రిటన్‌ తొలి రెండు స్థానాల్లో నిలువగా... భారత్‌కు మూడో స్థానం దక్కింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement