
టీమిండియా యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్ ఆడేందుకు సిద్దమయ్యాడు. గత కొంత కాలంగా భారత టెస్టు జట్టులో కీలక సభ్యునిగా ఉన్న జైశ్వాల్ ఇప్పుడు ఆస్ట్రేలియా పిచ్లలో ఎలా రాణిస్తాడో అని అందరూ అతృతగా ఎదురు చూస్తున్నారు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న తొలి టెస్టులో సత్తా చాటేందుకు యశస్వీ సైతం ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్తో కలిసి భారత ఇన్నింగ్స్ను ఈ ముంబైకర్ ప్రారంభించే అవకాశముంది.
అయితే ఈ మ్యాచ్కు ముందు అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ జైశ్వాల్ మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఇచ్చిన సలహా తన కెరీర్ ఎదుగుదలలో ఎలా సహాయపడిందో జైశ్వాల్ చెప్పుకొచ్చాడు.
"విరాట్ కోహ్లితో నాకు మంచి అనుబంధం ఉంది. క్రికెట్ను కెరీర్గా ఎక్కువ కాలం కొనసాగించాలంటే క్రమశిక్షణతో ఉండాలని, ఆటను గౌరవించడం చాలా ముఖ్యమని కోహ్లి నాతో చెప్పాడు. విరాట్ భాయ్ సలహా నా కెరీర్ ఎదుగుదలలో ఎంతగానో సహాయపడింది.
అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అతడిలా కష్టపడి పనిచేసేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాను అని యశస్వీ పేర్కొన్నాడు. తన కెరీర్లో ఇప్పటివరకు 14 టెస్టులు ఆడిన జైశ్వాల్.. 56.28 సగటుతో 1407 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్లలో రెండు డబుల్ సెంచరీలతో పాటు 3 శతకాలు, 8 హాఫ్ సెంచరీల ఉన్నాయి. తన తొలి టెస్టు సిరీస్లోనే యశస్వీ డబుల్ సెంచరీ సాధించడం గమనార్హం.
చదవండి: బాబాకీ జై! : మంజ్రేకర్పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్