వన్డే ప్రపంచకప్-2023కు సర్వం సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా మరో కొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానంది. తొలి మ్యాచ్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ఆరంభం కానుంది.
కాగా కివీస్తో తొలి మ్యాచ్కు ముందు ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్లో రూట్ మరో 20 పరుగులు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన 15వ ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు. ఇప్పటివరకు 428 ఇన్నింగ్స్లు ఆడిన రూట్.. 18555 పరుగులు చేశాడు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని అధిగమిస్తాడు. గంగూలీ తన అంతర్జాతీయ కెరీర్లో 18575 పరుగులు సాధించాడు. అదేవిధంగా ఈ వరల్డ్కప్ టోర్నీలో 445 పరుగులు చేస్తే 19000 పరుగుల మైలు రాయిని అందుకుంటాడు. రూట్ తన వన్డే కెరీర్లో 6246 పరుగులు చేశాడు. అంతేకాకుండా ఐసీసీ వన్డే వరల్డ్కప్ టోర్నీల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఇంగ్లండ్ క్రికెటర్గా రూట్(758 పరుగులు) కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ తుది జట్టు(అంచనా): జానీ బెయిర్స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్, మొయిన్ అలీ, లివింగ్స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్
చదవండి: గంభీర్ ఓ యోధుడు.. చాలా మంది అపార్ధం చేసుకున్నారు: అశ్విన్