భారత హాకీ జట్టు (PC: Khel India X)
మహిళల జూనియర్ ఆసియా కప్ టోర్నీలో భారత హాకీ జట్టు సంచలన విజయం సాధించింది. దాయాది పాకిస్తాన్ను ఏకంగా 19-0 గోల్స్ తేడాతో మట్టికరిపించింది. తద్వారా ఆసియా కప్ టోర్నీ సెమీ ఫైనల్కు దూసుకువెళ్లింది.
ఆది నుంచే భారత్ ఆధిపత్యం
చైనాలోని మోకీ వేదికగా గురువారం నాటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో భారత్- పాక్ యువ జట్లు తలపడ్డాయి. ఆట మొదలైన ఏడో నిమిషంలోనే పూజా సాహూ గోల్ కొట్టడంతో భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత రోషిణి ఐంద్, తనుశ్రీ దినేశ్ కదూ, సుఖ్వీర్ కౌర్, సనికా చంద్రకాంత్ మనే కూడా గోల్స్ సాధించారు.
దీంతో ఆది నుంచే భారత్ ఆధిపత్యం కొనసాగించింది. ఇక 23వ నిమిషంలో మనే తన రెండో గోల్ కొట్టగా.. తనూజ తొప్పూ, పూజా మాలిక్, పూర్ణిమా యాదవ్ కూడా గోల్స్ సాధించారు. ఫలితంగా ఆట తొలి అర్ధ భాగంలోనే భారత్ 10-0తో తిరుగులేని ఆధిక్యం సంపాదించింది.
ఇక రెండో అర్ధ భాగంలోనూ భారత మహిళా జట్టు జోరు కొనసాగించింది. మాలిక్ హ్యాట్రిక్ గోల్స్తో దుమ్ములేపగా.. సుప్రియా రెండుసార్లు గోల్ కొట్టింది. క్రిష్ణా శర్మ, బినిమా ధన్, రోషిణి కూడా అద్భుత ఆట తీరు కనబరుస్తూ పాకిస్తాన్ను మరింత కష్టాల్లోకి నెట్టారు.
ఏకపక్ష విజయం
ఆఖరి నిమిషంలో రోషిణి మరోసారి గోల్ కొట్టడంతో భారత్ పాక్పై 19-0 గోల్స్ తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. తద్వారా భారత మహిళా హాకీ జూనియర్ జట్టు ఆసియా కప్ సెమీ ఫైనల్లోకి దూసుకువెళ్లింది.
కాగా మహిళల జూనియర్ హాకీ ఆసియా కప్ 2023, 2024 ఎడిషన్లలో భారత జట్టు విజేతగా నిలిచింది. తాజా ఎడిషన్లోనూ చాంపియన్గా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. కాగా తాజా సెమీ ఫైనల్లో భారత్... సౌత్ కొరియా- మలేషియా మధ్య మ్యాచ్ విజేతతో తలపడుతుంది. ఇక గ్రూప్ దశలో భారత్ ఇప్పటికే జపాన్, మలేషియా, సౌత్ కొరియాలను ఓడించి టాపర్గా నిలిచింది.
పాకిస్తాన్తో మ్యాచ్లో గోల్స్ కొట్టిన భారత ప్లేయర్లు
పూజా సాహూ (7వ నిమిషం), రోషిణి ఐంద్ (9, 60+ నిమిషం), తనుశ్రీ దినేశ్ కదూ (11వ నిమిషం), సుఖ్వీర్ కౌర్ (13వ నిమిషం), సనికా చంద్రకాంత్ మనే (13, 23వ నిమిషం), మధూ సిదార్ (16, 39వ నిమిషం), గీతా యాదవ్ 18వ (నిమిషం), తనూజ తొప్పూ (25వ నిమిషం), పూజా మాలిక్ (27, 49, 51వ నిమిషం), పూర్ణిమా యాదవ్ (33వ నిమిషం), సుప్రియ (40, 54వ నిమిషం), క్రిష్ణ శర్మ (48వ నిమిషం), బినిమా ధన్ (55వ నిమిషం).
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్!


