వీవీఎస్ లక్ష్మణ్- గిల్, గంభీర్ (PC: BCCI/X)
అఫ్గానిస్తాన్తో టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసి జోరు మీదున్న టీమిండియా.. తదుపరి వెస్టిండీస్తో తలపడేందుకు సిద్ధమైంది. సొంతగడ్డపై విండీస్ జట్టుతో సెప్టెంబరు 27- అక్టోబరు 17 మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లు ఆడనుంది.
ఇందుకు సంబంధించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికే జట్లను ప్రకటించింది. అయితే, శుబ్మన్ గిల్ సారథ్యంలో వన్డే జట్టు స్వదేశంలో విండీస్తో తలపడనుండగా.. అదే సమయంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీ20 జట్టు జపాన్ వేదికగా ఆసియా క్రీడలు ఆడేలా షెడ్యూల్ ఖరారైంది.
ఇక్కడ గంభీర్.. అక్కడ లక్ష్మణ్
ఈ నేపథ్యంలో విండీస్తో సిరీస్కు హెడ్కోచ్ గౌతం గంభీర్ మార్గదర్శనం చేయనుండగా.. ఆసియా క్రీడల్లో వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20 జట్టుకు తాత్కాలిక హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా యువ ఆల్రౌండర్కు సంబంధించి గంభీర్- గిల్... వీవీఎస్ లక్ష్మణ్ మధ్య గట్టి వాదనలు జరిగినట్లు సమాచారం.
అందుకే ఇద్దరూ అతడినే కోరుకున్నారు
దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ను విండీస్తో వన్డేల్లో ఆడించాలని గంభీర్- గిల్ భావించినట్లు సమాచారం. కరేబియన్ జట్టులో ఐదుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున వాషీ సేవలు కోరుకున్నట్లు తెలుస్తోంది.

PC: BCCI
అయితే, ఇప్పటికే వాషీ ఆసియా క్రీడల జట్టులో ఉన్నాడు. ప్రతిష్టాత్మక టోర్నీలో నేరుగా క్వార్టర్ ఫైనల్కు చేరిన టీమిండియా.. నేపాల్తో తలపడటం దాదాపుగా ఖాయమే. ఆ జట్టులోనూ ఐదుగురు లెఫ్టాండర్ బ్యాటర్లు ఉన్నారు. కాబట్టి వాషీ తమతో పాటే జపాన్కు రావాలని వీవీఎస్ లక్ష్మణ్ బోర్డు వద్ద తన వాదన వినిపించినట్లు తెలుస్తోంది.
ఎవరి మాట నెగ్గిందంటే
ఈ నేపథ్యంలో గంభీర్- గిల్తో జరిగిన వాదనలో లక్ష్మణ్ నెగ్గినట్లు తెలుస్తోంది. విండీస్తో వన్డేలకు ఎంపిక చేయకుండా.. ఆసియా క్రీడల జట్టుతోనే వాషింగ్టన్ సుందర్ను కొనసాగించడం ఇందుకు నిదర్శనం.
అయితే, ఆసియా క్రీడలు ముగించుకున్న తర్వాత శ్రేయస్ సేన స్వదేశంలో విండీస్తో టీ20 సిరీస్లో తలపడనుండగా.. ఈ జట్టులో మాత్రం వాషీకి చోటు దక్కింది. కాగా ఎడమచేతి వాటం బ్యాటర్లను తిప్పలు పెట్టడంలో వాషీకి మంచి రికార్డే ఉంది. ఇప్పటి వరకు వన్డే, టీ20లలో కలిపి 5.67 ఎకానమీ రేటుతో అతడు 37సార్లు లెఫ్టాండర్లను అవుట్ చేశాడు.
చదవండి: నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన భారత బ్యాటర్ అతడే: కమిన్స్


