కమిన్స్ (PC: Instagram)
ఆస్ట్రేలియాకు ప్రపంచకప్ ట్రోఫీ అందించిన కెప్టెన్లలో ప్యాట్ కమిన్స్ ఒకడు. అతడి సారథ్యంలో 2023లో ఆసీస్ భారత్ వేదికగా ఫైనల్లో టీమిండియాను ఓడించి వన్డే వరల్డ్కప్ టైటిల్ గెలుచుకుంది. ఇక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్-2023 ఫైనల్లోనూ కమిన్స్ బృందం.. భారత్ను ఓడించి గదను అందుకుంది.
రోహిత్- కోహ్లి కాదు!
కాగా రైటార్మ్ పేసర్ అయిన కమిన్స్ తన కెరీర్లో ఇప్పటి వరకు ఎంతో మంది టీమిండియా స్టార్లకు బౌలింగ్ చేశాడు. దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో కూడి ఉన్న భారత జట్లపై ఎక్కువగా ఆడాడు. అయితే, తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బ్యాటర్గా కమిన్స్ వీరిద్దరిలో ఎవరి పేరును చెప్పలేదు.
వంద డాట్ బాల్స్ను కూడా..
ఇంతకీ కమిన్స్ బౌలింగ్కు పరీక్ష పెట్టి అతడికి కఠిన సవాలుగా నిలిచిన భారత బ్యాటర్ ఎవరూ అంటారా?.. ఈ విషయంపై కమిన్స్ స్వయంగా స్పందించాడు. ప్రైమ్వీడియోలో మాట్లాడుతూ.. ‘‘నేను ఎదుర్కొన్న టఫెస్ట్ ఇండియన్ బ్యాటర్ అంటే పుజారా పేరు చెప్తాను. అతడిని అవుట్ చేయడం అత్యంత కష్టం.
అతడు పెద్దగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించడు. అయినా సరే బౌలర్లకు తలనొప్పిగా మారతాడు. పుజారా తలచుకుంటే వంద డాట్ బాల్స్ను కూడా నవ్వుతూనే ఎదుర్కొంటాడు. బౌలర్కు అసలు అవుట్ చేసే అవకాశమే ఇవ్వడు’’ అని కమిన్స్ టీమిండియా టెస్టు స్పెషలిస్టుగా పేరొందిన ఛతేశ్వర్ పుజారాపై ప్రశంసలు కురిపించాడు.
జాబితాలో వీరూ ఉన్నారు
ఇక తాను ఎదుర్కొన్న కఠినమైన బ్యాటర్ల జాబితాలో అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్), ఏబీ డివిలియర్స్ (సౌతాఫ్రికా), బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్), తిలకరత్నె దిల్షాన్ (శ్రీలంక), క్రిస్ గేల్ (వెస్టిండీస్) కూడా ఉన్నారని కమిన్స్ తెలిపాడు.
దిగ్గజ టెస్టు బ్యాటర్ పుజారా
కాగా గుజరాత్కు చెందిన ఛతేశ్వర్ పుజారా 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. తన కెరీర్లో కేవలం ఐదు వన్డేలు ఆడిన పుజారా.. టెస్టుల్లో మాత్రం వంద మ్యాచ్ల మైలురాయిని దాటాడు. మొత్తంగా 103 టెస్టులు ఆడి 7195 పరుగులు సాధించాడు. ఇందులో 35 అర్ధ శతకాలు, 19 శతకాలు.. మూడు డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.
విదేశీ గడ్డపై ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లలో పుజారా ఫాస్ట్బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ గంటల కొద్దీ క్రీజులో నిలబడేవాడు. ఆసీస్పై 2018-19, 20202-21 బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన ఘనత పుజారాకే దక్కుతుంది.
ఆసీస్తో మొదలు.. కంగారూలతోనే ముగింపు
ఇక ఆసీస్తో 2010 నాటి టెస్టు సందర్భంగా టీమిండియా తరఫున కెరీర్ మొదలుపెట్టిన పుజారా.. 2023లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో భాగంగా ఆసీస్తోనే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం విశేషం. కాగా పుజారా ఇటీవలే అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
చదవండి: బట్లర్ ప్రపంచ రికార్డు


