PC: BCCI/X
స్వదేశంలో అఫ్గానిస్తాన్తో జరిగిన మూడు టీ20ల సిరీస్ను భారత జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఈ సిరీస్ అసాంతం శ్రేయస్ అయ్యర్ సారధ్యంలోని టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ముఖ్యంగా ఆఖరి టీ20లో అయితే భారత బ్యాటర్లు చెలరేగిపోయారు.
ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 30 బంతుల్లో శతక్కొట్టి, అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచూరియన్గా నిలవగా.. సంజూ శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా శ్రేయస్ సేన ప్రత్యర్ధి ముందు 222 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగల్గింది. అఫ్గాన్ ఈ కొండంత లక్ష్యాన్ని చేధించలేక 94 పరుగులకే కుప్పకూలింది. ఇక ఈ మ్యాచ్ అనంతరం భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తమ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20ల్లో 300 పరుగులు సాధించడమే మా లక్ష్యమని గంభీర్ అన్నాడు.
"అఫ్గానిస్తాన్తో చివరి మ్యాచ్లో భారత జట్టుకు మెరుపు ఆరంభం దక్కింది. మరీ ముఖ్యంగా పవర్ప్లేలో మనవాళ్లు చాలా దూకుడుగా ఆడారు. ఆరు ఓవర్లలోనే జట్టు స్కోరు 100 పరుగుల మార్క్ దాటింది. నా కోచింగ్ కాలంలో ఇదే అత్యధికం. దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించినప్పుడు అదే జోరు కొనసాగిస్తే భారీ స్కోరు సాధ్యమే. టి20ల్లో ఇప్పటి వరకు మన జట్టు 300 మైలురాయిని అందుకోలేదు.
మా తదుపరి లక్ష్యం అదే. ఎందుకంటే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్రతిభతో అదేం పెద్ద కష్టం కాదు. అభిషేక్ దూకుడు అందరికీ తెలిసిందే. అఫ్గాన్తో మూడో టి20లో అతడి సెంచరీ డ్రెస్సింగ్ రూమ్పై చాలా ప్రభావం చూపింది" అని గంభీర్ పేర్కొన్నాడు.
కాగా సిరీస్లో యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావడంపై గంభీర్ స్పందించాడు. వైభవ్ సూర్యవంశీలో అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ, అతడు స్వదేశంలో అరంగేట్రం చేసేందుకు మరికొంత కాలం వేచి చూడక తప్పదని గంభీర్ వెల్లడించాడు.
ఇంగ్లండ్తో టి20 సిరీస్ సందర్భంగా సంజూ సామ్సన్ను తుది జట్టు నుంచి తప్పించడం తన కెరీర్లోనే అత్యంత కఠిన నిర్ణయమన్న గంభీర్... వన్డే, టెస్టు సారథి శుబ్మన్ గిల్కు సంపూర్ణ మద్దతు ఉంటుందని వివరించాడు.
చదవండి: మరోసారి టీమిండియాకు అదే ‘గండం’.. స్పందించిన బీసీసీఐ


