భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్తో ఇబ్రహీం (PC: BCCI X)
భారత్లో తొలిసారి టీమిండియాకు టీ20 సిరీస్లో ఆతిథ్యం ఇచ్చిన అఫ్గానిస్తాన్కు చేదు అనుభవమే మిగిలింది. ఢిల్లీ వేదికగా జరిగిన ఈ సిరీస్లో భారత్.. అఫ్గాన్పై ఏకపక్ష విజయాలు సాధించింది.
అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం జరిగిన మూడో టీ20లో అఫ్గాన్ను ఏకంగా 127 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన టీమిండియా.. 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం అఫ్గాన్ కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ స్పందించాడు.
నిరాశ కలిగింది.. పవర్ ప్లేలో పర్లేదు
‘‘కచ్చితంగా నిరాశ కలిగించే సిరీస్ ఇది. అయితే, పవర్ప్లేలో మేము కాస్త మెరుగయ్యాము. అందుకు నేను కాస్త సంతోషంగా ఉన్నాను. అయితే, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయాము.
సిరీస్ మొదటి నుంచే మేము ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయితే, రోజురోజుకీ ఆటను మెరుగుపరచుకునేందుకు కృషి చేస్తున్నాము. టీ20 ప్రపంచకప్ తర్వాత మాకిదే తొలి సిరీస్. ఇంకా ఎన్నో పటిష్ట జట్లతో మరిన్ని మ్యాచ్లు, సిరీస్లు ఆడాల్సి ఉంది. అందుకు తగినట్లుగా ప్రణాళికలు రచించుకోవాల్సి ఉంది’’ అని ఇబ్రహీం జద్రాన్ పేర్కొన్నాడు.
భారత ఓపెనర్లు అద్భుతం
మరోవైపు.. అఫ్గానిస్తాన్ హెడ్కోచ్ రిచర్డ్ పైబస్ కూడా స్పందించాడు.. ‘‘మా ఆట చాలా చెత్తగా సాగింది. అయితే టాస్ గెలవడం కాస్త ఊరటనిచ్చినా.. తొలి పది ఓవర్ల ఆట మా నియంత్రణలో లేకుండా పోయింది. భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ (34 బంతుల్లో 108), సంజూ శాంసన్ (35 బంతుల్లో 50) అద్భుతంగా, అందంగా బ్యాటింగ్ చేశారు.
మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారు
అయితే, తర్వాతి పది ఓవర్లలో మా బౌలర్లు తిరిగి పుంజుకున్నారు. ఇది మాకు సానుకూల అంశం. నిజంగానే మా వాళ్లు అద్బుతంగా పోరాటం చేశారు. ఫీల్డింగ్లోనూ రాణించారు. కానీ 222 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో మా వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయారు.
వేరే దారి లేకుండా పోయింది
ఓవర్కు పదకొండు పరుగుల చొప్పున రాబట్టడం కష్టమే. పరిస్థితిని ఎదుర్కోవడం తప్ప వేరే దారి లేదు. మా ప్రణాళికలకు తగ్గట్లు బ్యాటింగ్ చేయలేకపోయాము. ఓపెనర్లు ఇబ్రహీం (25), గుర్బాజ్ (15) దూకుడుగా మొదలుపెట్టినా దానిని కొనసాగించలేకపోయారు. లోపాల్ని సరిచేసుకుని ముందుకు సాగుతాము’’ అని రిచర్డ్ పైబస్ చెప్పుకొచ్చాడు.
చదవండి: అభిషేక్ శర్మ అద్భుతం.. అఫ్గాన్ ఆట ప్రశంసనీయం: శ్రేయస్ అయ్యర్!


