రోహిత్‌-కోహ్లి అభిమానులకు శుభవార్త | Virat Kohli, Rohit Sharma To Get Extra Matches For India On The Road To 2027 ODI World Cup | Sakshi
Sakshi News home page

రోహిత్‌-కోహ్లి అభిమానులకు శుభవార్త

Mar 13 2026 7:19 AM | Updated on Mar 13 2026 7:24 AM

Virat Kohli, Rohit Sharma To Get Extra Matches For India On The Road To 2027 ODI World Cup

భారత దిగ్గజ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ అభిమానులకు శుభవార్త అందుతుంది. 2027 వన్డే ప్రపంచకప్‌ లక్ష్యంగా క్రికెట్‌లో కొనసాగుతున్న రో-కోకు ఆ మెగా టోర్నీకి ముందు అదనపు వన్డేలు ఆడే ఆస్కారమున్నట్లు తెలుస్తుంది. ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌లో (FTP) షెడ్యూలైన మ్యాచ్‌లకు అదనంగా కొన్ని దేశాలు భారత్‌తో వన్డేలు ఆడేందుకు బీసీసీఐని సంప్రదిస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే ఈ ఏడాది భారత్‌ షెడ్యూల్‌ కిక్కిరిసిపోయింది. అదనంగా మ్యాచ్‌లు అంటే అభిమానులకు పండగే. శ్రీలంక, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌ దేశాల క్రికెట్‌ బోర్డులు అదనపు మ్యాచ్‌ల కోసం బీసీసీఐని అభ్యర్థిస్తున్నట్లు తెలుస్తుంది.

కొద్ది రోజుల కిందటే టీ20 ప్రపంచకప్‌ ముగిసిన విషయం తెలిసిందే. మార్చి 28 నుంచి ఐపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండు నెలలకు పైగా ప్రపంచ క్రికెటర్లంతా బిజీగా ఉంటారు. టీమిండియా అంతర్జాతీయ షెడ్యూల్‌ జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ సిరీస్‌తో మొదలవుతుంది.

అనంతరం జులై 1 నుంచి భారత జట్టు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ మధ్యలోనే ఐర్లాండ్‌ జట్టు టీమిండియాతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం అభ్యర్థిస్తుందట. ఈ విషయం పట్ల బీసీసీఐ కూడా సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తుంది.

ఆతర్వాత భారత జట్టు ఆగస్టు–సెప్టెంబర్ నెలల్లో టెస్ట్‌, టీ20 సిరీస్‌ల కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. ఇది కాకుండా శ్రీలంక జట్టు ఈ ఏడాది చివర్లో భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం రిక్వెస్ట్‌ చేస్తుందని తెలుస్తుంది.

ఈ ఏడాది అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో టీమిండియా న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్ట్‌లు, 3 వన్డేలు, 5 టీ20లు షెడ్యూల్‌ అయ్యాయి. వీటికి అదనంగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు మరిన్ని వన్డేలు ఆడాలని బీసీసీఐని కోరుతుంది.

వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో ఇంగ్లండ్‌ కూడా భారత్‌తో అదనపు వన్డే సిరీస్‌ కోసం ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇవే కాక బంగ్లాదేశ్‌, జింబాబ్వే లాంటి చిన్న జట్లతో పరిమిత ఓవర్ల సిరీస్‌లు కూడా FTPకి అదనంగా ప్రోగ్రెస్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

మొత్తానికి 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నద్దం కావాలనుకుంటున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మకు మెగా టోర్నీకి ముందు వీలైనన్ని వన్డేలు ఆడే అవకాశం దొరికేలా ఉంది. ఇది వారివారి అభిమానులకు పండగే. రో-కో టెస్ట్‌, టీ20లకు వీడ్కోలు పలికి వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 

వన్డే ప్రపంచకప్‌ వచ్చే ఏడాది సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో జరుగనుంది. ఈ లోపు రో-కో పదుల సంఖ్యలో వన్డేలు ఆడే అవకాశం ఉంటుంది. దీని వల్ల దిగ్గజాలు మరిన్ని రికార్డులు బద్దలు కొట్టి, అభిమానుల గుండెల్లో తమ స్థానాలను మరింత సుస్థిరం చేసుకుంటారు.

ఐపీఎల్‌ 2026 అనంతరం టీమిండియా షెడ్యూల్‌ (అంచనా)..
ఆఫ్ఘనిస్తాన్‌తో 3 వన్డేలు, ఓ టెస్ట్‌
ఐర్లాండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు సన్నాహాలు జరుగుతున్నాయి
ఇంగ్లండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు (అదనపు మ్యాచ్‌లపై ఆసక్తి)
శ్రీలంకతో 3 టీ20లు, 2 టెస్ట్‌లు
బంగ్లాదేశ్‌తో 3 వన్డేలు, 3 టీ20లు (ప్రభుత్వ అనుమతి అవసరం)
ఆఫ్ఘనిస్తాన్‌తో 3 టీ20లు
జింబాబ్వే టీ20 సిరీస్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి
వెస్టిండీస్‌తో 3 వన్డేలు, 5 టీ20లు
ఆసియా క్రీడలు
న్యూజిలాండ్‌తో 3 వన్డేలు, 5 టీ20లు, 2 టెస్ట్‌లు (అదనంగా 2 వన్డేలకు అభ్యర్థన)
శ్రీలంకతో 3 వన్డేలు, 3 టీ20లు
ఆస్ట్రేలియాతో 5 టెస్ట్‌లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement