T20 WC: రోహిత్‌, ద్రవిడ్‌పై సూర్యకుమార్‌ విమర్శలు?! | Spread Like Virus: Suryakumar On Rohit led Side Brand Cricket Wont Work | Sakshi
Sakshi News home page

T20 WC: రోహిత్‌ సేన మాదిరి ఆడితే కష్టం.. అందుకే ఇలా: సూర్యకుమార్‌

Mar 12 2026 4:41 PM | Updated on Mar 12 2026 6:06 PM

Spread Like Virus: Suryakumar On Rohit led Side Brand Cricket Wont Work

టీమిండియా ఇప్పటికి మూడు టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీలు గెలిచింది. ఐసీసీ తొలిసారి 2007లో ప్రవేశపెట్టిన పొట్టి క్రికెట్‌ వరల్డ్‌కప్‌లో ధోని సారథ్యంలో విజేతగా నిలిచిన భారత్‌.. 2024లో రోహిత్‌ కెప్టెన్సీలో టైటిల్‌ గెలిచింది. తాజాగా సూర్యకుమార్‌ యాదవ్‌ సారథ్యంలో 2026లో సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడి చరిత్ర సృష్టించింది.

2024 మాదిరి కాదు
అయితే, 2024లో నాటి కెప్టెన్‌ రోహిత్‌- హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ (Rohit Sharma- Rahul Dravid) అనుసరించిన విధానాలకు, 2026లో సూర్య- గంభీర్‌ వ్యూహాలకు చాలా తేడా ఉందని యాజమాన్యం చెబుతోంది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ విషయంపై స్వయంగా స్పందించాడు. వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడకూడదనే నియమం పెట్టుకున్నామని.. అదే తమకు సత్ఫలితాలు ఇచ్చిందని పేర్కొన్నాడు.

వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి..
‘‘2024 టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఎలా ఆడామో మాకు తెలుసు. అయితే, అదే బ్రాండ్‌ ఆఫ్‌ క్రికెట్‌తో కొనసాగితే కష్టమని అర్థమైంది. అందుకే.. వ్యక్తిగత మైలురాళ్లను పక్కన పెట్టి మ్యాచ్‌లు గెలవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం.

ఈసారి సెమీ ఫైనల్‌ వరకు అందరూ ఈ విషయాన్ని గమనించే ఉంటారు.. మా జట్టులోని ఆటగాళ్లలో ఒక్కరూ టాప్‌ రన్‌ స్కోరర్‌ లేదంటే లీడింగ్‌ వికెట్‌ టేకర్‌గా లేరు. అయినా సరే మేము గెలుస్తూనే ఉన్నాం.

ప్రతి మ్యాచ్‌లో ప్రతి ఒక్క ఆటగాడు తనవంతు సహకారం అందించాడు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఇలా జట్టుగా ముందుకు సాగాలన్న వ్యూహాన్ని ఓ వైరస్‌లాగా వ్యాప్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం. పద్దెనిమిది నెలల క్రితమే ఈ సంప్రదాయాన్ని జట్టులో ప్రవేశ పెట్టాము’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నాడు.

కోహ్లిపై విమర్శలు
ఇక టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ సైతం సూర్య అభిప్రాయంతో ఏకీభవించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి గురించి అతడు చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. ‘‘గత వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో రోహిత్‌, విరాట్‌, జడేజా వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నిండి ఉంది.

ఈసారి బుమ్రా, హార్దిక్‌ తప్ప పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. అయితే, అప్పటికి ఇప్పటికి మేము ఇన్నింగ్స్‌ ప్లాన్‌ చేసిన విధానం వేరుగా ఉంది. మా ఆలోచనకు తగినట్లు అప్పుడు రోహిత్‌ శర్మ మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడేవాడు.

కానీ విరాట్‌ కోహ్లి యాంకర్‌ ఇన్నింగ్స్‌ ఆడేవాడు. ఇతరులతో కలిసి భాగస్వామ్యాలు నెలకొల్పడం, కాస్త నెమ్మదిగా ఆడటం వంటి వ్యూహం ఉండేది. కానీ ఇప్పుడలా కాదు. హార్దిక్‌, అభిషేక్‌ వంటి ఆటగాళ్లు తమదైన శైలిలో కొత్త జోష్‌ తీసుకువచ్చారు. 2024, 2026 జట్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే’’ అని సితాన్షు కొటక్‌ పేర్కొన్నాడు.

చదవండి: T20 WC 2026: ‘అతడిపై వేటు నా నిర్ణయమే.. నాపై కోప్పడ్డాడు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement