సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా ఆదివారం సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. ఓవరాల్గా మూడోసారి, వరుసగా రెండోసారి పొట్టి ఫార్మాట్ వరల్డ్కప్ ట్రోఫీ ముద్దాడిన ఏకైక జట్టుగా రికార్డు సాధించింది.
లీగ్ దశలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించిన భారత్.. సూపర్-8 దశలో తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చేతిలో మాత్రం 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తద్వారా టీ20 వరల్డ్కప్లో పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో తుదిజట్టు కూర్పుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా అక్షర్ పటేల్ (Axar Patel) స్థానంలో వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను ఆడించడాన్ని మాజీ క్రికెటర్లు సైతం తప్పుబట్టారు. ఈ విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా స్పందించాడు.
అతడి కోపం చల్లారలేదు
‘‘అక్షర్ పటేల్ ఆరోజు చాలా చాలా కోపంగా ఉన్నాడు. ఆ స్థానంలో ఏ ఆటగాడు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారు. అతడొక అనుభవజ్ఞుడైన ప్లేయర్. ఐపీఎల్లో ఓ జట్టు కెప్టెన్గానూ ఉన్నాడు. కాబట్టి అతడి కోపంలో అర్థం ఉంది.
నా వల్లే తప్పు జరిగిందని.. నన్ను క్షమించమని కోరాను. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే నిర్ణయం తీసుకున్నానని అతడికి వివరించాను. కానీ అతడి కోపం చల్లారలేదు. మరుసటి రోజు వరకు కూడా అతడు నాపై కోపంగానే ఉన్నాడు’’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు.
అక్షర్ను తప్పించి..
కాగా నెదర్లాండ్స్తో మ్యాచ్కు ముందు అక్షర్ స్వల్పంగా గాయపడిన విషయం తెలిసిందే. అయితే, సౌతాఫ్రికాతో మ్యాచ్కు ముందు అతడి పరిస్థితి మెరుగ్గానే ఉన్నా వాషీని తుదిజట్టుకు ఎంపిక చేయడంతో అక్షర్ పటేల్ తీవ్ర నిరాశకు గురైనట్లు సూర్య మాటల ద్వారా తెలుస్తోంది. అక్షర్ను తప్పించి.. వాషీని ఆడించాలనేది తన నిర్ణయమేనని సూర్య స్పష్టం చేయడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే, వెస్టిండీస్లపై గెలిచి సెమీస్ చేరింది టీమిండియా. ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లోనూ విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్ను ఓడించి టైటిల్ను కైవసం చేసుకుంది.
కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్
ఈ టోర్నీలో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఎనిమిది మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు తీశాడు. ముఖ్యంగా న్యూజిలాండ్తో ఫైనల్లో కేవలం 27 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇంగ్లండ్తో సెమీ ఫైనల్లో అక్షర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ల వల్లే ఉత్కంఠ పోరులో టీమిండియాకు విజయం సాధ్యమైందని చెప్పవచ్చు.
చదవండి: T20 WC: 'వరల్డ్కప్ కంటే.. నాన్నతో గడిపిన క్షణాలే విలువైనవి'


