T20 WC: షాకిచ్చిన ఐసీసీ.. సమర్థించిన గంభీర్‌ | Even if he hadnt said sorry: Gambhir on Arshdeep Daryl Mitchell clash | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన ఐసీసీ!.. అర్ష్‌దీప్‌ తప్పేమీ లేదు.. సమర్థించిన గంభీర్‌

Mar 11 2026 7:56 PM | Updated on Mar 11 2026 8:01 PM

Even if he hadnt said sorry: Gambhir on Arshdeep Daryl Mitchell clash

టీమిండియా పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ సమర్థించాడు. డారిల్‌ మిచెల్‌ విషయంలో అర్ష్‌దీప్‌ చేసిన దాంట్లో తనకు తప్పేమీ కనిపించలేదన్నాడు. క్రికెట్‌ మైదానంలో ఇలాంటివి సహజమేనని.. అర్ష్‌ సారీ చెప్పడం తనకు నచ్చలేదన్నాడు. అసలేం జరిగిందంటే.. టీ20 ప్రపంచకప్‌-2026 ఫైనల్లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌ అనుచితంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

మిచెల్‌కు గట్టిగా తగిలిన బంతి
అహ్మదాబాద్‌లో జరిగిన టైటిల్‌ పోరులో క్రీజులో ఉన్న కివీస్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌కు బౌలింగ్‌ చేసిన అర్ష్‌దీప్‌ బంతిని అతడివైపే ఆడగా... బంతిని అందుకున్న వెంటనే పేసర్‌ బలంగా విసిరిపెట్టి కొట్టడంతో ఆ బంతి గట్టిగా మిచెల్‌కు తగిలింది. దీనిపై అప్పుడే మిచెల్‌ కోపంగా అర్ష్‌దీప్‌ వైపు దూసుకురాగా తొలుత అంపైర్, తర్వాత కెప్టెన్‌‌ సూర్యకుమార్‌ సముదాయించడంతో చల్లబడ్డాడు.

అనంతరం  అర్ష్‌దీప్‌ కూడా మిచెల్‌ దగ్గరికి వెళ్లి క్షమాపణ కోరడంతో ఆ వివాదం మ్యాచ్‌తో పాటే ముగిసిపోయింది. అయితే ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడంతో ఐసీసీ  అర్ష్‌దీప్‌నకు జరిమానా విధించింది. మ్యాచ్‌ ఫీజులో 15 శాతం కోతపెట్టినట్లు ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.  

అందులో అర్ష్‌దీప్‌ తప్పేమీ లేదు
ఇదిలా ఉంటే.. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ANI పాడ్‌కాస్ట్‌కు హాజరు కాగా  అర్ష్‌దీప్‌ గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మరేం పర్లేదు. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాడు మైదానంలో ఆ మాత్రం దూకుడు ప్రదర్శించడం సహజమే.

బంతిని అలా విసిరితే తప్పేంటి? వరుసగా రెండు సిక్సర్లు తన బౌలింగ్‌లో బాదితే ఏ బౌలర్‌కైనా ఇలాగే ఉంటుంది. ఎవరూ దీనిని సహించరు. బ్యాటర్‌ పట్ల ఇలాగే స్పందిస్తారు. అందులో తప్పేమీ లేదు. అందుకు అతడు క్షమాపణ కోరాల్సిన అవసరం కూడా లేదు.

అయితే, అతడు సారీ చెప్పి మంచి పనిచేశాడు. ఏదేమైనా మైదానంలో శత్రువులు, స్నేహితులు ఉండరు. దేశానికి ప్రాతినిథ్యం వహించే సమయంలో గెలుపు కోసం ఆటగాళ్లు ఏమైనా చేస్తారు. గతంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయి. 

అయితే ఈ సోషల్‌ మీడియా యుగంలో పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మారేలా చేస్తున్నారు. ఇదేం పద్ధతో నాకైతే అర్థం కావడం లేదు’’ అని గంభీర్‌  అర్ష్‌దీప్‌ను వెనకేసుకువచ్చాడు. కాగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో ఓడించి భారత్‌ టీ20 ప్రపంచకప్‌ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement