వెస్టిండీస్ క్రికెట్ జట్టు
వెస్టిండీస్ క్రికెటర్, కోల్కతా నైట్ రైడర్స్ మాజీ ప్లేయర్ జేవన్ సీర్లెస్కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) భారీ షాకిచ్చింది. సీర్లెస్పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. బార్బడోస్లో జరిగిన బీమ్10 లీగ్ (2023-24 సీజన్) సమయంలో సీర్లెస్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
క్రికెట్ వెస్టిండీస్, ఐసీసీ అవినీతి నిరోధక కోడ్లోని ఐదు నిబంధనలను సీర్లెస్ ఉల్లంఘించినట్లు ఐసీసీ గుర్తించింది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేలా సీర్లెస్ వ్యవహరించినట్లు విచారణలో వెల్లడైంది. అతడితో పాటు టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, అధికారి ట్రెవాన్ గ్రిఫిత్పై కూడా ఐసీసీ తాత్కాలిక నిషేదం విధించింది.
సీర్లెస్పై అత్యధికంగా నాలుగు చార్జీలు నమోదు కాగా, చిత్రంజన్పై మూడు, గ్రిఫిత్పై ఒక చార్జ్ నమోదైంది. అయితే తమపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించడానికి వీరి ముగ్గురికి 14 రోజుల సమయం ఉందని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే బీమ్ టీ10 లీగ్ వ్యవహారంలో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్పై కూడా ఐసీసీ సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు టీ 20 ప్రపంచకప్-2026కు దూరమయ్యాడు.
చదవండి: సచిన్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ..


