
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ యేడు ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆనందం ఆ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు కానీ, అభిమానాలకు కానీ, యాజమాన్యానికి కానీ ఎన్నో రోజుల మిగల్లేదు.
ఆర్సీబీ టైటిల్ గెలిచిన మరుసటి రోజు, అంటే జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 75 మందికి పైగా గాయపడ్డారు.
ఈ విషాద సంఘటనపై నాడు యావత్ క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మానవాళి మొత్తం మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. చాలా కాలం సైలెంట్గా ఉన్న ఆర్సీబీ యాజమాన్యం కొద్ది రోజుల కిందటే మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారం ప్రకటించింది.
తాజాగా ఈ ఘటనపై ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి కూడా స్పందించాడు (తొలిసారి). ఆర్సీబీ అధికార వెబ్సైట్ ద్వారా తన భావాలను పంచుకున్నాడు.
జూన్ 4 లాంటి విషాదాన్ని జీవితంలో ఏదీ సిద్ధం చేయదు. ఇది మా ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత ఆనందకరమైన క్షణంగా ఉండాల్సింది. కానీ విషాదంగా మారింది. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. గాయాలపాలైన వారు పూర్తిగా కోలుకోవాలని దేవుడిని వేడుకుంటున్నాను. వారి బాధ మా కథలో భాగమైంది. ఇకపై జాగ్రత్తగా, గౌరవంతో, బాధ్యతతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు.
“Nothing in life really prepares you for a heartbreak like June 4th. What should’ve been the happiest moment in our franchise’s history… turned into something tragic. I’ve been thinking of and praying for the families of those we lost… and for our fans who were injured. Your… pic.twitter.com/nsJrKDdKWB
— Royal Challengers Bengaluru (@RCBTweets) September 3, 2025
కాగా, బెంగళూరు దుర్ఘటనపై ఏర్పాటైన రిటైర్డ్ జడ్జి మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ ఆర్సీబీ యాజమాన్యాన్ని బాధ్యులుగా చేసిన విషయం తెలిసిందే. తదనంతర పరిణామాల్లో ఆర్సీబీ యాజమాన్యం బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. బెంగళూరులో శ్రద్ధాంజలి స్థూపం నిర్మించనున్నట్లు వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా 6-పాయింట్ల మానిఫెస్టోను విడుదల చేసింది.